చెత్త తొలగింపు ట్రాక్టర్లకు స్వస్తి-రంగంలోకి E-ఆటోలు
100 వాహనాలను శనివారం…
నెల్లూరు: నెల్లూరు నగరంలో చెత్త సేకరణ, తరలింపు వ్యవస్థను మరింత ఆధునికీకరించేందుకు కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాక్టర్ల ద్వారా చెత్త తొలగింపు విధానానికి స్వస్తి పలుకుతూ, నగరంలో 200 ఎలక్ట్రిక్ ఆటోలను వినియోగంలోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా తొలి విడతలో 100 ఎలక్ట్రిక్ ఆటోలను శనివారం నిర్వహించనున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు,మంత్రి నారాయణ వర్చువల్గా ప్రారంభించనున్నారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను గురువారం గాంధీబొమ్మ సెంటర్లో డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, కార్పొరేషన్ అధికారులు, పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం రూప్కుమార్ యాదవ్ మాట్లాడుతూ, నగరంలో చెత్త సేకరణను మరింత సమర్థవంతంగా,పర్యావరణహితంగా నిర్వహించాలనే ఉద్దేశంతో మంత్రి నారాయణ ఎలక్ట్రిక్ ఆటోలను వినియోగంలోకి తీసుకురావాలని నిర్ణయించారని తెలిపారు.
కార్పొరేషన్ పరిధిలో మొత్తం 200 ఎలక్ట్రిక్ ఆటోలను కొనుగోలు చేశామని, తొలి విడతలో 100 ఆటోలను స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ వర్చువల్గా ప్రారంభిస్తారని చెప్పారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర టీడీపీ అధ్యక్షుడు మామిడాల మధు, శివాలయం చైర్మన్ అజయ్, టీడీపీ నాయకులు బాలాజీ, తిరుమలనాయుడు, జహీర్, దర్శి హరికృష్ణ, పిట్టి సత్య నాగేంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు.

