పార్లమెంట్ చర్చల్లో ‘నేషన్ ఫస్ట్’ భావన వినిపించాలి- ఉప ముఖ్యమంత్రి
అమరావతి: పార్లమెంట్ చర్చల్లో జాతీయ దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా, నేషన్ ఫస్ట్ అనే భావన స్పష్టంగా ప్రతిఫలించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,పార్టీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అవసరమైన అంశాలను బలంగా వినిపించాలని స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్లో జనసేన పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో చర్చకు రానున్న బిల్లులు, వాటిపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహాలపై పవన్ కళ్యాణ్ సమగ్రంగా చర్చించారు. సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు:- పార్లమెంటు వేదికగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ప్రతి అంశంపై జనసేన పార్టీ తరఫున గళం వినిపించాలని ఆయన సూచించారు. ముఖ్యంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రాజెక్టులకు మరిన్ని నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ లోక్ సభ సభ్యులు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేష్ లు పాల్గొన్నారు.

