సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటిన భారత్ కు చెందిన 30 నౌకలు
క్యూలో మరో 26..
అమరావతి: అమెరికా, ఇరాన్ దేశాల మధ్య యుద్దం పరిస్థితులు తగ్గు ముఖం పట్టడడం,వెంటనే దౌత్యపరమైన చర్చలు సఫలం కావడంతో ఇంధన నౌకలు రాకపోకలు ప్రారంభం అయ్యాయి. ఈ పరిణామం భారత దేశానికి పెద్ద ఊరటనిచ్చింది. భారత్ కు చెందిన 30 నౌకలు ఇప్పటికే సురక్షితంగా హర్మూజ్ జలసంధిని దాటాయి. మరో 26 నౌకలు ప్రయాణ అనుమతి కోసం క్యూలైన్లో వేచి ఉన్నాయి. భారత షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. పర్షియన్ గల్ఫ్ ప్రాంతం నుంచి వచ్చే ముడిచమురు, ద్రవీకృత పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ), వ్యవసాయానికి అవసరమైన ఎరువుల సరఫరా కోసం భారతదేశం ప్రధానంగా ఈ మార్గంపైనే ఆధారపడుతుంది. క్యూలో ఉన్న 26 భారతీయ నౌకల్లో 3 నౌకలు ఇంధన లోడుతో, 10 నౌకలు ఎరువులతో, మిగిలిన 13 నౌకలు ఇతర నిత్యావసర వస్తువులతో ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాయి. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీకి చెందిన రెండు భారీ ఎల్ఎన్జీ ట్యాంకర్లు సురక్షితంగా ప్రయాణించి తమిళనాడులోని ఎన్నూర్, కేరళలోని కొచ్చి టెర్మినల్స్ కు చేరుకున్నాయి. హర్మూజ్ జలసంధి ద్వారా రవాణా సజావుగా జరిగితే దేశంలో ఇంధన ధరలు స్థిరపడతాయని, ఎరువుల కొరత తీరి వ్యవసాయ రంగానికి మేలు జరుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. యుద్ధం దాదాపు ముగిసినప్పటికీ బీమా ఖర్చులు పెరగడం, సముద్రంలో మైన్ల తొలగింపు వంటి సవాళ్లు ఉన్నందున రవాణా పూర్వస్థితికి రావడానికి మరికొన్ని వారాల సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు వ్యాఖ్యనిస్తున్నారు.

