డీఎమ్ఈ గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ఎ.విష్ణు వర్ధన్
అమరావతి: రాష్ట్ర వైద్య విద్యా శాఖ నూతన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (DME)గా డా.ఎ.విష్ణు వర్ధన్ శుక్రవారం అధికారికంగా పాత ఆసుపత్రి ప్రాంగంణంలోని డీఎమ్ఈ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. డాక్టర్ ఎ.విష్ణువర్ధన్ ఎం.డి (అనస్థీషియాలజీ) పూర్తి చేసి వైద్య విద్యా రంగంలో విశేష అనుభవం సంపాదించారు. ప్రస్తుతం కాకినాడలోని రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్గా సేవలందిస్తూ, విద్యార్థుల విద్యాభివృద్ధి, వైద్య సేవల మెరుగుదల కోసం అనేక విధాలుగా కృషి చేశారు.
డీఎంఈగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా వైద్య విద్యా ప్రమాణాలను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో నాణ్యమైన వైద్య విద్య, ఆధునిక సౌకర్యాల కల్పన, అధ్యాపకులు, విద్యార్థుల అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ సమర్థవంతమైన పరిపాలన అందించేందుకు కట్టుబడి ఉంటానని తెలిపారు. ప్రభుత్వ బోధనా ఆసుపత్రులలో పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. అలాగే ఆసుపత్రులలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పరిశోధనలకు ప్రాధాన్యత ఇస్తామని పేర్కొన్నారు.
అభినందించిన వారిలో ఇశా అధ్యక్షులు డాక్టర్ చక్రరావు, యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ సురేష్, ఎస్ఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ ఏ.వై. రావు, మనోవైద్య నిపుణులు డాక్టర్ కృష్ణమోహన్, డాక్టర్ ఠాగూర్, డాక్టర్ కర్నాటి శరత్తో పాటు పలువురు వైద్యులు, అధ్యాపకులు, అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

