మహా యజ్ఞంలా విత్తన బంతుల తయారీ, పంపిణీ-ఉప ముఖ్యమంత్రి
అడవుల్లో జీవ వైవిధ్యం..
అమరావతి: అడవులలో జీవవైవిధ్యాన్ని పెంపొందించడం, పర్యావరణ పరిణామాన్ని మెరుగుపరచడం, పర్యావరణ స్థిరత్వం, పచ్చదనాన్ని పెంచడం, వాతావరణ మార్పులను సమర్థవంతంగా తట్టుకునే విధంగా స్వచ్ఛమైన, పచ్చని ఆంధ్రప్రదేశ్ను నిర్మించడం కోసం ఈ హరిత ఉద్యమం ప్రధాన లక్ష్యం. ఈ అంశంపై అటవీ శాఖ అధికారులకి దిశానిర్దేశం చేశారు.శుక్రవారం అటవీ శాఖపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జూన్ నెలలో నిర్వహించనున్న విత్తన బంతుల (సీడ్ బాల్స్) తయారీ కార్యక్రమంపై అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో 2.5 కోట్ల విత్తన బంతులను పంపిణీ చేయాలని అధికారులను పవన్ ఆదేశించారు. వీటి తయారీ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చాలని అన్నారు. అందుకు అన్ని వర్గాల ప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని సూచించారు.
పచ్చని ఆంధ్రప్రదేశ్:- ఈ ఏడాది వర్షాకాల సీజన్ను పూర్తిగా వినియోగించుకోవాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. జులై, ఆగస్టు నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా విత్తన బంతులను విస్తారంగా చల్లడానికి అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. ఇందుకోసం మూడు రకాల ప్రత్యేక పద్ధతులను ఉపయోగించాలని సూచించారు. నేరుగా చల్లడం, అత్యాధునిక డ్రోన్ సాంకేతికతను వినియోగించడం, చేతులతో నాటడం చేయాలని ఆయన పేర్కొన్నారు. అడవుల్లో జీవ వైవిధ్యాన్ని పెంపొందించడం, స్వచ్ఛమైన, పచ్చని ఆంధ్రప్రదేశ్ను నిర్మించడం లక్ష్యం అన్నారు.

