మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం- AIADMK నేత అన్బళగన్
అమరావతి: తమిళనాడు రాజకీయాలు గంట గంటకు మలుపులు తిరుగుతున్నాయి.”రిసార్టు రాజకీయాలు” ఉపందుకున్నాయి. సంఖ్య బలంపై నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ, AIADMK త్వరలోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అన్బళగన్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా ఒక ‘అద్భుతం’ జరగబోతోందని ఆయన వ్యాఖ్యానించడం ప్రస్తుతం తమిళనాడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. అన్బళగన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుతం మా పార్టీకి 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లభిస్తోంది కాబట్టి రాజ్యాంగబద్ధంగా మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అన్నారు. ఇతర పక్షాల మద్దతు కూడా మాకు లభించబోతోంది అని ఆయన వెల్లడించారు.
జంప్ జిలానీ కాకుండా జాగ్రత్తలు:- ప్రభుత్వ ఏర్పాటు దిశగా పావులు కదుపుతున్న AIADMK, తమ ఎమ్మెల్యేలు జంప్ జిలానీ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తమిళనాడులో నూతన ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధత నెలకొనడంతో అన్నాడీఎంకే తమ ఎమ్మెల్యేలను పుదుచ్చేరిలోని రిసార్టుకు తరలించింది. సీనియర్ నేతల పర్యవేక్షణలో 28 మంది ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలకు వసతి కల్పించినట్లు తెలుస్తోంది. ఈ ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే సీనియర్ నాయకుడు సి.వి. షణ్ముగం మద్దతుదారులని వార్తలు వస్తుండటంతో రాజకీయ వర్గాల్లో అనేక ఊహాగానాలకు దారితీసింది. అన్నాడీఎంకే తరఫున ఎన్నికైన 47 మంది ఎమ్మెల్యేల్లో కొంత మంది విజయ్ నేతృత్వంలోని టీవీకేకు మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని తమిళనాడు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
పవర్ షేరింగ్పై చర్చలు:- ప్రభుత్వ ఏర్పాటు కోసం టీవీకేకు మద్దతు ఇచ్చే విషయంపై ఏఐఏడీఎంకే నాయకులతో తమిళనాడు మాజీ మంత్రి, టీవీకే నేత కేఏ సెంగోట్టయ్యన్తో సహా పార్టీ సీనియర్ నేతలు చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది. పవర్ షేరింగ్పై కూడా చర్చలు జరుగుతున్నాయని సమాచారం. దీని ప్రకారం సీవీ షణ్ముగంకు కీలక మంత్రి పదవులతో పాటు ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా ఆఫర్ చేసే అవకాశం ఉందని సంబంధి వర్గాల నాయకులు పేర్కొన్నారు.

