విద్యుత్ ఉద్యోగులకు 17.651 శాతం డీ.ఏకు అమోదం
71,387 మంది ఉద్యోగులకు..
హైదరాబాధ్: తెలంగాణ విద్యుత్ శాఖ ఉద్యోగులకు 17.651 శాతం DA ఖరారు చేస్తూ విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు రూపొందించిన ప్రతిపాదనలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆమోదం తెలిపారు. బహిరంగ మార్కెట్లో పెరుగుతున్న ధరల సూచి ఆధారంగా ప్రతి సంవత్సరం జనవరి, జులై నెలలో డియర్ నెస్ అలవెన్స్ (DA)/డియర్ నెస్ రిలీఫ్ (DR) ను సమీక్షిస్తూ విడుదల చేస్తారు. అందులో భాగంగా ఈ సంవత్సరం 1-7-2025 నుంచి అమలయ్యేలా ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డిఎ/డిఆర్ ను 17.651 శాతంగా ఖరారు చేశారు. తాజా ఉత్తర్వులతో విద్యుత్ సంస్థల పరిధిలోనికి 71,387 వేల మంది ఉద్యోగులు, ఆర్టిజెన్లు, పెన్షనర్లు లబ్ది పొందనున్నారు.
పెంచిన డీఏ ప్రకారం టీజీ ట్రాన్స్ కోలో 3,036 మంది ఉద్యోగులకు, 3,769 మంది ఆర్టిజన్లకు, 2,446 మంది పెన్షనర్లకు మొత్తంగా 9,251 మందికి లబ్ది చేకూరనుంది. జెన్ కో విషయానికి వస్తే 6,913 మంది ఉద్యోగులకు 3,583 మంది ఆర్టిజన్లకు, 3,579 మంది పెన్షనర్లకు లబ్ది జరగనుంది. ఎస్పీడీసీఎల్ లో 11,957 మంది ఉద్యోగులకు 8,244 మంది ఆర్టిజన్లకు, 8,244 మంది పెన్షనర్లకు లబ్ది జరగనుంది. ఎన్పీడీసీఎల్ పరిధిలో 9,728 మంది ఉద్యోగులకు 3,465 మంది ఆర్టిజన్లకు, 6,115 మంది పెన్షనర్లకు లబ్ది జరగనుంది. మొత్తంగా ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లు కలిపి 71,387 మందికి లబ్ది చేకూరనుంది.

