AP&TG

ఇంటింటా నెట్‌జీరో-ఇంటి నుంచే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం-సీఎం చంద్రబాబు

అమరావతి: పర్యావరణ పరిరక్షణను ఇంటింటి ఉద్యమంగా మార్చి,  గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యవంతంగా, పర్యావరణహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం నెట్‌జీరో గ్రామాల కార్యక్రమాన్ని అమలు చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. ఇంటి స్థాయి నుంచి కాలనీ, గ్రామ స్థాయి వరకు పర్యావరణహిత విధానాలను అమలు చేస్తూ.. క్రమంగా గ్రామాలను నెట్‌జీరో కమ్యూనిటీలుగా మార్చే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గంలోని అలవరం కోడూరులో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని నెట్‌జీరో కార్యక్రమాలను పరిశీలించారు. నెట్‌జీరో గ్రామంలో అమలు చేస్తున్న కార్యక్రమాలు, సాధిస్తున్న లక్ష్యాలను జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్‌ ముఖ్యమంత్రికి వివరించారు. ఇంటింటా సౌర విద్యుత్‌ వినియోగం, పరిశుభ్రమైన వంట విధానాలు, తడి వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారీ, మురుగునీటి నిర్వహణ వంటి చర్యల ద్వారా కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడంతో పాటు గ్రామాలను పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు.

వంటింటి వ్యర్థాలే సేంద్రియ ఎరువులు:- నెట్‌జీరో కార్యక్రమాలను అమలు చేస్తున్న జె. మహేశ్వరరావు నివాసాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. మహేశ్వరరావు, ఆయన సతీమణి ఇంట్లో చేపడుతున్న పర్యావరణహిత కార్యక్రమాలను ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ఇంటిపై ఏర్పాటు చేసిన 3 కిలోవాట్ల సోలార్‌ రూఫ్‌టాప్‌ను సీఎం పరిశీలించారు. సౌర విద్యుత్‌తోనే ఇండక్షన్‌ స్టవ్‌ను వినియోగించడం ద్వారా అదనపు విద్యుత్‌ వ్యయాన్ని కూడా తగ్గించుకోవచ్చని లబ్ధిదారులు తెలిపారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *