ఆగష్టు 14, 15 తేదీల్లో సాయంత్రం ప్రజలు, విద్యార్థులకు ఉచిత ప్రవేశం-అయ్యన్నపాత్రుడు
4 తరువాత సంతకాలు చేసే దొంగ పద్ధతి..
డ్యూటీ చేయని ఎమ్మెల్యేలకు జీతాలు కట్ చేసేలా..
ప్రాంగణంలో ఫోన్లతో రీల్స్ చేయడంపై నిషేధం..
అమరావతి: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ప్రజాపండగలా నిర్వహించేందుకు అమరావతి అసెంబ్లీ ప్రాంగణం సిద్ధమైందని శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. కేవలం విద్యుత్ దీపాల అలంకరణలు, అధికారుల జెండా వందనానికే పరిమితం కాకుండా సామాన్య ప్రజలను, విద్యార్థులను ఇందులో భాగస్వాములను చేయాలని స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. పూర్వం నందమూరి తారకరామారావు చెప్పే “మన సభ – జన సభ” అనే స్ఫూర్తితో అసెంబ్లీ గేట్లను ప్రజల కోసం తెరవనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆగస్టు 14, 15 తేదీలలో సాయంత్రం వేళల్లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, పాఠశాల విద్యార్థులు సకుటుంబంగా వచ్చి అసెంబ్లీ విద్యుత్ కాంతులను వీక్షించవచ్చని వెల్లడించారు. ఈ సందర్భంగా సాయంత్రం వేళల్లో ప్రత్యేక పోలీస్ బ్యాండ్ ప్రదర్శనలు, స్వాతంత్ర్య పోరాట త్యాగాలను ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయనున్నారు. నేటి తరం పిల్లలకు దేశ స్వాతంత్ర్య చరిత్ర తెలియాలనే ఉద్దేశంతో విద్యార్థులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నామని, వీలును బట్టి వారిని అసెంబ్లీ మెయిన్ హాల్ సందర్శనకు కూడా అనుమతిస్తామని వెల్లడించారు.ప్రాంగణంలో ఫోన్లతో రీల్స్ చేయడం వంటి వాటిపై క్రమశిక్షణ దృష్ట్యా కొన్ని నిబంధనలు విధిస్తామని, ఈ వేడుకల భద్రతపై డిజిపి, సీపీలతో ప్రత్యేకంగా సమీక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు.
4 తరువాత సంతకాలు చేసే దొంగ పద్ధతి:- శాసనసభ సమావేశాలకు హాజరుకాని ప్రజాప్రతినిధుల వైఖరిపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎమ్మెల్యేలు సభకు రాకుండా వేతనాలు, భత్యాలు ఎలా డిమాండ్ చేస్తారని ఆయన ప్రశ్నించారు. గతంలో సభకు రాకుండా నాలుగైదు రోజుల తర్వాత వచ్చి సంతకాలు చేసే దొంగ పద్ధతి ఉండేదని, దానికి స్వస్తి పలుకుతూ తమ హయాంలో ‘డిజిటల్ ఫేస్ రికగ్నిషన్ / కెమెరా అటెండెన్స్’ తీసుకువచ్చామని పేర్కొన్నారు. సభ్యులు తమకు కేటాయించిన సీట్లో కూర్చుంటేనే హాజరు పడుతుందన్నారు. సభకు హాజరుకాని ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడానికి, వారి జీతాల్లో కోత విధించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని జాతీయ స్పీకర్ల వేదికపై తాను ప్రతిపాదించినట్లు అయ్యన్నపాత్రుడు వెల్లడించారు.

