గుంటూరు సమీపంలో రూ.100 కోట్లతో కేంద్ర యోగా పరిశోధన సంస్థ ఏర్పాటు-మంత్రి సత్యకుమార్
100 పడకల ఆసుపత్రితో సమగ్ర వైద్య సేవలు..
స్థలాన్ని పరిశీలించి ఓకే చెప్పిన కేంద్ర బృందం..
మూడు నెలల్లో మౌలిక వసతులు పూర్తి..
అమరావతి: గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం నడింపాలెం(గుంటూరు దగ్గర్లో) లో 15.03 ఎకరాల్లో రూ.100 కోట్లతో కేంద్ర యోగా, ప్రకృతి వైద్య పరిశోధన సంస్థ (సీఆర్ఐవైఎన్) ఏర్పాటు కానుందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ అధికారిక బృందం మంగళవారం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించి, ఆమోదం తెలిపిందన్నారు. మూడు నెలల్లో స్థల అభివృద్ధి, రహదారి, కాలువ తదితర మౌలిక సదుపాయాల పనులు పూర్తిచేసి కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణ పనులు వేగంగా జరుగుతాయని తెలిపారు. ఈ సంస్థ కార్యకలాపాలు 2028 లో ప్రారంభమవుతాయని తెలిపారు.
100 పడకల ప్రత్యేక ఆసుపత్రి:- సంస్థ ప్రాంగణంలోనే 100 పడకల యోగా–ప్రకృతి వైద్య ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. జీవనశైలి వ్యాధులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు యోగా, ప్రకృతి వైద్యంతో సమగ్ర చికిత్స అందించడంతో పాటు పరిశోధన, చికిత్స, శిక్షణ సేవలు ఒకేచోట అందుబాటులో ఉంటాయన్నారు. అత్యాధునిక పరిశోధనా ప్రయోగశాలలు, ప్రత్యేక చికిత్సా విభాగాలు, శిక్షణా కేంద్రాలు, అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు ఈ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటవుతాయని చెప్పారు.

