భవన నిర్మాణ అనుమతుల సరళీకరణతో రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం
మంత్రి నారాయణను సన్మానం..
అమరావతి: భవన నిర్మాణ అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ పురపాలక శాఖ ఇటీవల జారీ చేసిన జీవో నెం.161ను స్వాగతిస్తూ క్రెడాయ్ ఆంధ్రప్రదేశ్ (CREDAI AP) ప్రతినిధులు రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. భవన నిర్మాణ అనుమతుల నిబంధనలను సరళీకరించడంలో మంత్రి నారాయణ కీలక పాత్ర పోషించారని క్రెడాయ్ ప్రతినిధులు అభినందించారు. సెల్ఫ్ డిక్లరేషన్ విధానం అమలు, సెట్బ్యాక్ నిబంధనల్లో సడలింపులు, అనుమతుల ప్రక్రియలో తీసుకొచ్చిన సంస్కరణలు నిర్మాణ రంగానికి ఎంతో మేలు చేశాయని పేర్కొన్నారు.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ నాయకత్వంలో రియల్ ఎస్టేట్ రంగానికి అనుకూల వాతావరణం ఏర్పడిందని, దీంతో పరిశ్రమలో పెట్టుబడులు, నిర్మాణ కార్యకలాపాలు గణనీయంగా పెరుగుతున్నాయని క్రెడాయ్ ప్రతినిధులు వెల్లడించారు.

