43 మoది వైద్యుల డిస్మిస్-మరో 34 మంది రాజీనామాలు-మంత్రి సత్యకుమార్
విధులకు దూరంగా ఉంటే…
అమరావతి: ప్రభుత్వ వైద్య సేవలకు దూరంగా అనధికారికంగా విధులకు ఎగనామం పెడుతున్న 43 మంది వైద్యుల( సివిల్ అసిస్టెంట్ సర్జన్) పై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ కఠిన చర్యలకు ఉపక్రమించింది. గరిష్టంగా నాలుగేళ్ల నుంచి విధులకు రాకుండా ఉన్న వీరికి నిబందనలు అనుసరించి సంజాయిషీ నోటీసుల జారీతోపాటు అభియోగాలు నమోదుచేసినప్పటికీ స్పందన లభించక పోవడంతో, విధుల నుంచి శాశ్వతంగా తప్పించాలని నిర్ణయించినట్లు వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన బుధవారం ఓ ప్రకటన జారీచేశారు. గత నెలలో డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని బోధనాసుపత్రుల్లో పనిచేసే వైద్యుల్లో 51 మంది అనధికారికంగా విధులకు దూరంగా ప్రభుత్వ నిబంధనలు అనుసరించి తప్పించారు. ఇదేవిధంగా ప్రస్తుతం డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ పరిధిలోనూ జరిగేందుకు అవసరమైన చర్యలు తుదిదశకు చేరుకున్నాయి. వీరిలో జనరల్ మెడిసిన్,ఆర్థో, గైనిక్ ఇతర వైద్యులు ఉన్నారు.
మరో 34 మంది రాజీనామాలు:- వాస్తవానికి 118 మంది పర్మినెంట్ వైద్యులు అనధికారికంగా విధులకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏడాదికి మించి అనధికారికంగా విధులకు దూరంగా ఉంటే విధుల నుచి తప్పించవచ్చు. వీరిపై ప్రభుత్వ నిబంధన అనుసరించి అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగానే 43 మంది వైద్యులను శాశ్వతంగా విధుల నుంచి తప్పించే ప్రక్రియ మొదలైంది. ఈ 43 మంది కాకుండా మరో 34 మంది వైద్యులు సంజాయిషీ నోటీసులు జారీ, అభియోగాల నమోదు అనంతరం రాజీనామాలు చేశారు.

