బరాక్, బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలతో INS మహేంద్రగిరి యుద్ధనౌక-రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
రక్షణ, ఏరోస్పేస్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్..
అమరావతి: భారత నౌకాదళంలోకి మరో అత్యంత అధునిక సాంకేతిక పరిజ్ఙానంతో తయారు చేసిన స్వదేశీ యుద్ధనౌక INS మహేంద్రగిరి శనివారం అధికారికంగా నావిక దళంలో చేరింది. శనివారం ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నేవల్ డాక్యార్డ్ లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ యుద్ధనౌకను జాతికి అంకితం చేశారు. ఈ సందర్బంలో రక్షణ మంత్రి మాట్లాడుతూ, INS మహేంద్రగిరి కేవలం ఒక యుద్ధనౌక మాత్రమే కాదు, భారత నౌకాదళం శక్తి, సామర్థ్యం, స్వావలంబనకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. భారత రక్షణ, ఏరోస్పేస్ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ కొత్త శక్తికేంద్రంగా మారిందని తెలిపారు. కొత్త టెక్నాలజీలు, సంప్రదాయ విధానాలు ఒకటికి ఒకటి వేరు కాదని, ఒకదానిపై ఒకటి ఆధారపడుతాయని, పోటీపడుతాయని, సంప్రదాయ ఫ్లాట్ఫామ్లు లేకుండా, కొత్త టెక్నాలజీ అసంపూర్ణంగా ఉంటుందన్నారు.
బరాక్, బ్రహ్మోస్ వ్యవస్థలతో:- INS మహేంద్రగిరి యుద్ధనౌకలోని 75 శాతానికి పైగా భాగాలు స్వదేశీ సాంకేతికతతో రూపొందించబడ్డాయని, భారతదేశంలోనే డిజైన్, తయారీ నైపుణ్యం, ఆత్మనిర్భర్ భారత్ సంకల్పం, అలాగే దేశ రక్షణ రంగంలో పెరుగుతున్న స్వదేశీ శక్తికి ఇది దర్ఫణం అన్నారు. మజగావ్ డాక్ షిప్బిల్డర్స్ లో INS మహేంద్రగిరిని నిర్మించారు. బరాక్, బ్రహ్మోస్ వంటి అత్యాధునిక క్షిపణి వ్యవస్థలతో సముద్రం, గగనతలంలోని లక్ష్యాలను సమర్థవంతంగా ఛేదించే సామర్థ్యం ఈ యుద్ధనౌకకు ఉందని సంబంధిత అధికారులు వెల్లడించారు.

