వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం-15 మంది భారతీయ పర్యాటకులు మృతి
మొబైల్ కంపెనీ తరపున..
ప్రయాణికుల వివరాలు…
అమరావతి: వియత్నాంలో ఘోర బోటు ప్రమాదం చోటు చేసుకుంది. దక్షిణ వియత్నాంలో ఒక ద్వీప పర్యటన ముగించుకుని తిరిగి వస్తున్న పర్యాటక స్పీడ్ బోటు శనివారం బోల్తా పడటంతో 15 మంది భారతీయ పర్యాటకులు మరణించారని అధికారిక మీడియా తెలిపింది. వియత్నాంకు చెందిన అతిపెద్ద ద్వీపమైన ‘ఫు క్వోక్’ (Phu Quoc) సమీపంలోని ‘హాన్ మే రుట్ న్గోయ్’ (Hon May Rut Ngoai) ద్వీపం నుండి సుమారు 400 మీటర్ల (1,310 అడుగుల) దూరంలో బోటు బోల్తా పడినప్పుడు, అందులో 32 మంది భారతీయ పర్యాటకులు, బోటు చెందిన నలుగురు సిబ్బంది ఉన్నారని అధికారులు పేర్కొన్నారు.
కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్:- ప్రమాద సమయంలో బోటులో 32 మంది పర్యాటకులు ఉన్నారు. మృతుల్లో ఏపీకి చెందిన వారు కూడా ఉన్నారు. మచిలీపట్నానికి చెందిన జయశ్రీ మృతి చెందగా.. ఆమె భర్త కిశోర్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కడప జిల్లాకు చెందిన డిస్ట్రిబ్యూటర్ శ్రీధర్ మరణించగా.. కడపకు చెందిన మరో డిస్ట్రిబ్యూటర్ నయీం ఒడ్డున ఉండటంతో ప్రాణాలు దక్కించుకున్నారు. ఈ ఘటనపై స్థానిక అధికారులతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
మొబైల్ కంపెనీ తరపున భారత్లోని ఆంద్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడుతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వియత్నాంకు 250 మంది డీలర్లు వెళ్లారు. ట్రిప్లో 35 మంది ఏపీకి చెందిన వారు కాగా 40 మంది తెలంగాణకు చెందిన డీలర్లు ఉన్నారు. వీరంతా మూడు బోట్లలో వియత్నాంకు సముద్రంలో విహారయాత్రకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో హాలాంగ్బేలో స్పీడ్ బోటు బోల్తా పడింది. సరిహద్దు దళాలు, నావికాదళం, తీర రక్షక దళం,ఇతర సంస్థలు సహాయక చర్యల్లో చేరడానికి ముందే, సమీపంలోని పడవలు నీటిలో ఉన్న ప్రయాణికులను రక్షించాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రతికూల వాతావరణం వల్లనే బోటు మునిగిపోయినట్లు స్థానిక అధికారులు చెబుతున్నారు. బోటు పూర్తిగా తలకిందులు కావడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడినట్లు వెల్లడించారు.

కంట్రోల్ రూమ్ ఏర్పాటు:- వియత్నాం భారతీయ రాయభార కార్యాలయం ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. బాధితుల కుటుంబాలకు సమాచారం, సహాయం అందించేందుకు, హో చి మిన్ సిటీలోని భారత కాన్సులేట్ జనరల్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది. దీనిని +84 36 281 7930, +84 91 552 37 14 మరియు +84 33 452 0414 నంబర్లలో సంప్రదించవచ్చు. హనోయిలో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబడింది, దీనిని +84 91 308 9165 నంబర్లో సంప్రదించవచ్చు. ఎలాంటి సహాయం, సందేహాలకైనా మేము అందుబాటులో ఉంటామని తెలిపింది.

