‘భారత ఐటీ పరిశ్రమ “ఏఐ యాజ్ ఎ సర్వీస్” దిశగా ముందుకు సాగాలి’- కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
హైదరాబాద్: భారత్ సొంతమైన విశ్వసనీయ ప్రపంచ ఖ్యాతిని, నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను సద్వినియోగం చేసుకుంటూ… భారత ఐటీ పరిశ్రమ సాఫ్ట్వేర్ సేవల ఆధారిత నమూనా నుంచి “ఏఐ యాజ్ ఏ సర్వీస్” నమూనాకు మారాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రైల్వేలు, సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ పిలుపునిచ్చారు. హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ (హెచ్వైఎస్ఈఏ) ఆధ్వర్యంలో “వికసిత్ భారత్-2047 నిర్మాణంలో సాంకేతికత పాత్ర” అంశంపై హైదరాబాద్ ఇండస్ట్రీ లీడర్ టౌన్హాల్లో జరిగిన కార్యక్రమంలో వైష్ణవ్ ప్రసంగించారు.
వ్యూహాత్మక మార్పు ఆవశ్యకతను ప్రధానంగా ప్రస్తావిస్తూ… భారత ఐటీ పరిశ్రమ ఇప్పుడు సాఫ్ట్ వేర్-యాజ్-ఎ-సర్వీస్ నమూనాను దాటి, ఏఐని ఒక సేవగా అందించే (ఏఐ యాజ్ ఎ సర్వీస్) నమూనా దిశగా పరిణామం చెందాలని వైష్ణవ్ సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక కృషి వల్ల ఆ దార్శనికత ఇప్పుడు వాస్తవరూపం దాల్చిందని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం 12 సెమీకండక్టర్ తయారీ ప్లాంట్లు వివిధ అభివృద్ధి దశల్లో ఉన్నాయని తెలిపారు. వాటిలో మూడు ప్లాంట్లు ఇప్పటికే జపాన్, యూరప్, దేశీయ మార్కెట్లకు ఎగుమతి అవుతున్న చిప్లను ఉత్పత్తి చేస్తున్నాయని ఆయన వివరించారు.

