రేపటి నుంచి సదరం స్లాట్ల బుకింగ్ ప్రారoభం-డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధర్
జోనళ్ల విధానంలో “స్లాట్ బుకింగ్..
అమరావతి: దివ్యాంగుల డేటా బేస్ భద్రత కోసం బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేవీఎన్ చక్రధరబాబు వెల్లడించారు. ఈ డేటాలో అనధికారికంగా మార్పులు చేయడానికి కుదరదని స్పష్టంచేశారు. ట్యాంపరింగ్ చేస్తే వెంటనే తమ దృష్టికి వస్తుందని తెలిపారు. ఇతర ప్రభుత్వ శాఖల్లో మాదిరిగానే తాము కూడా బ్లాక్ చెయిన్ టెక్నాలజీని వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. రెండో త్రైమాసిక (జులై నుంచి సెప్టెంబరు వరకు) స్లాట్ బుకింగ్ సౌకర్యాన్ని ఈ నెల 8 (బుధవారం) నుంచి కల్పించినట్లు తెలిపారు.
రెండుసార్లు మాత్రమే అప్పీలు:- దరఖాస్తుదారులకు తొలివిడత వైకల్య నిర్ధారణ పరీక్ష ఫలితంపై సంతృప్తి చెందకుంటే అదనంగా రెండుసార్లు మాత్రమే అప్పీలు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. దివ్యాంగులకు ప్రయోజనకరంగా ఉండేందుకు సర్టిఫికెట్ల జారీలో సంస్కరణలు తెచ్చామని తెలిపారు. రాష్ట్రoలోని జిల్లాలను 6 జోన్లగా విభజించామని, దరఖాస్తుదారులు తమ చుట్టుపక్కల ఉన్న జిల్లాల్లో వైకల్య నిర్ధారణ పరీక్షలు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దివ్యాంగులకు వ్యయప్రయాసాలు, ప్రయాణాలు తగ్గించేందుకు జోనళ్ల వ్యవస్థను అమల్లోనికి తెచ్చామని పేర్కొన్నారు. దివ్యాంగుల నుంచి వస్తోన్న రకరకాల విజ్ఞప్తులు, సందేహాలు నివృత్తి చేస్తూ చక్రధరబాబు నేడొక ప్రకటన జారీచేశారు. సీఎం చంద్రబాబు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నుంచి వచ్చే సలహాలు సూచనలు పరిగణన లోనికి తీసుకుంటూ దివ్యాంగులకు ప్రయోజనకరంగా ఉండేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.

