మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు- ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
8 విజ్ఞప్తులకు కేంద్రం నుంచి..
అమరావతి: ‘మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్టు మద్దతుగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి రంగంలోకి దిగనుంద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. పుష్కరాల నేపథ్యంలో గోదావరి కాలుష్య నివారణకు కేంద్ర ప్రభుత్వ సహకారం కోరిన వెంటనే కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుల్ని పంపి కాలుష్య నివారణ చర్యలకు సహకరించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ అంగీకారం తెలిపినట్టు చెప్పారు. అటవీశాఖ కామన్ ఫెసిలిటీ సెంటర్ నూతన అరణ్యారామం నిర్మాణంతోపాటు బేస్ క్యాంపుల పెంపు, గ్రేట్ గ్రీన్ వాల్ కి మద్దతు, ఒడిశా నుంచి కుంకీ ఏనుగులు, మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి 50 అడవి దున్నలు రాష్ట్రానికి రప్పించేందుకు సహకారం, తగ్గుతున్న ఆడ పులుల పెంపు చర్యలు తదితర 8 అంశాలపై కేంద్ర మంత్రితో చర్చించినట్టు తెలిపారు. మంగళవారం ఉదయం కేంద్ర అటవీ పర్యావరణ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశం అయ్యారు. అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.

