భారత సైన్యానికి తొలి విడతగా 41 JK 250E డ్రోన్లను అందజేసిన డ్రోగో ఏరోస్పేస్
ఆత్మనిర్భర్ భారత్..
హైదరాబాద్: భారతీయ రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికత అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తూ డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ (గతంలో డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్) భారత సైన్యానికి 41 జేకే 250E డ్రోన్లను తొలి విడతగా అంద చేసింది. మొదటి బ్యాచ్ డ్రోన్లను నాసిక్ లో ఉన్న సథరన్ కమాండ్ అధికారులు అందుకున్నారు. భారత సైన్యం నుంచి లభించిన మొత్తం రూ 72 కోట్ల విలువైన ఈ ఆర్డర్లో మిగిలిన డ్రోన్ల సరఫరాను ఈ ఏడాది ఆగస్టు నాటికి పూర్తి చేయాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టు ద్వారా దేశ రక్షణ ఆధునీకరణకు, కేంద్ర ప్రభుత్వ ‘మేక్ ఇన్ ఇండియా’- ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమాలకు సంస్థ తన వంతు సహకారం అందిస్తోంది. ఈ తొలి దశ డెలివరీ పూర్తి కావడం సంస్థ అభివృద్ధి గమనంలోనే కాక దేశీయ రక్షణ తయారీ రంగంలో కూడా ఒక కీలక మైలురాయిగా నిలిచినట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలోడ్రోగో ఏరోస్పేస్ తెలిపింది. డ్రోగో ఏరోస్పేస్ తయారు చేసిన ఈ ఆధునిక డ్రోన్లు ఒకసారి ఛార్జింగ్ చేస్తే మూడు గంటలు ఆకాశంలో ఎగురుతాయి.నిఘాకు, ఇతర సైనిక అవసరాలకు ఉపయోగపడతాయి.
పుట్టపర్తి జిల్లాలో జరిగిన:- డ్రోగో ఏరోస్పేస్ రక్షణ ఉత్పత్తులను కేంద్ర రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ లోని రక్షణ ఉత్పత్తుల కేంద్రం, డ్రోన్ సిటీ శంఖుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో డ్రోగో ఏరో స్పేస్ తన ఉత్పత్తులను ప్రదర్శించింది. వాటిని పరిశీలించిన కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి చంద్రబాబు ప్రశంసించారు.

