భారత ఆర్థిక రంగ మౌలిక అంశాలు దృఢంగా ఉన్నాయి-రిజర్వ్ బ్యాంకు
అభివృద్ది పథంలో..
అమరావతి: అంతర్జాతీయ అనిశ్చితులు, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపధ్యంలో… భారత ఆర్థిక రంగ మౌలిక అంశాలు దృఢంగా ఉన్నాయని, ఈ ఏడాది దేశం అభివృద్ది పథంలో పయనిస్తుందని శుక్రవారం భారత రిజర్వ్ బ్యాంకు వార్షిక నివేదికను విడుదల చేసింది. నివేదికలోని వివరాల ప్రకారం, కార్పొరేట్ రంగం, బ్యాకింగ్ రంగం లాభాల్లో ఉండటంతో పాటు మౌలిక వసతుల కల్పనకు భారత్ పెట్టుబడులు వెచ్చిస్తుండటంతో ఈసారి అభివృద్ధికి ఢోకా ఉండదని పేర్కొంది.
వాణిజ్య ఒప్పందాలు:- వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాలు కూడా ఆర్థికాభివృద్ధికి చోదక శక్తిగా మారనున్నాయి. ఇక ఎల్ నినో ప్రభావంతో ఈసారి భారత్లో వ్యవసాయ ఉత్పాదకత తగ్గే అవకాశం ఉందని కూడా ఆర్బీఐ తన నివేదికలో అంచనా వేసింది. ఈ వానాకాలం మలిదశలో హిందూ మహాసముద్రంలో పరిస్థితులు కొంత అనుకూలించి ఎల్ నినో ప్రభావం కొంత తగ్గవచ్చని కూడా ఆర్బీఐ అంచనా వేసింది.
ఎల్ నినో ప్రభావం:- పశ్చిమాసియా ఉద్రిక్తతల నెలకొన్నందున,దేశీయంగా ఎరువులు, ఇతర ముడి సరకుల ధరలపై ఒత్తిడి ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఎరువుల కొరత లేకుండా పలుమార్గాల్లో భారతదేశం వాటిని తీసుకుని వస్తున్నందున సమస్య కొంత మేర తక్కువగా ఉండొచ్చని వెల్లడించింది. దేశంలో తగినంత ధాన్యం నిల్వలు, రిజర్వాయర్లల్లో నీటి నిల్వలు ఉండటంతో వ్యవసాయంపై ఎల్ నినో ప్రభావం కొంత తగ్గి ఈ ఏడాది ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంటుందని ఆర్బీఐ అంచనాకు వచ్చింది.2026-31 మధ్య కాలానికి ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి పరిమితం చేయాలని నిర్ణయించికున్నందున, డీబీటీ పథకాలు, డొమెస్టిక్ రిటైల్ విభాగంలో డిజిటల్ కరెన్సీని మరింత విస్తరించే యోచనలో ఉన్నట్టు కూడా ఆర్బీఐ పేర్కొంది.

