డీఎస్సీ అక్రమాలు వెలుగులోకి-దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీల్లా ఉద్యోగాలు-వై.ఎస్.జగన్
ఒక్కొక్కటిగా బయటపడుతున్న అక్రమాలు..
జరగని పోటీలు, టోర్నీలు చూపి సర్టిఫికెట్లు జారీ..
ఆ సర్టిఫికెట్లు బోగస్ అంటూ అసోసియేషన్ల వెల్లడి..
అడ్డగోలుగా తమవారికి ఉద్యోగాల కల్పన. ఆ తర్వాత గేట్స్ క్లోజ్..
అసలు ఏ పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు..
అదే బాటలో అటవీ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం..
డీఎస్సీ స్కామ్ బయట పడడంతో 40 ఉద్యోగాలకు బ్రేక్
అమరావతి: డీఎస్సీ అక్రమాల్లో వెలుగులోకి మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయని.. దొంగ సర్టిఫికెట్లు, ఫ్యామిలీ ప్యాకేజీల్లా ఉద్యోగాలు ఇచ్చేశారని మాజీ సీ.ఎం-YSRCP అధ్యక్షుడు జగన్మోహన్రెడ్ది మండిపడ్డారు. డీఎస్సీలో ఒక్కొక్కటిగా అక్రమాలు బయట పడుతున్నా వాటిని కప్పి పుచ్చుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందని, అధికారుల ద్వారా వాటిని కప్పి పుచ్చేందుకు ప్రయత్నం చేస్తోందని ఆయన అరోపించారు.
జీఓలు రద్దు చేస్తూ మరిన్ని జీఓలు:- అసలు ఏ పరీక్ష లేకుండానే ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం, అందులోనూ టీచర్ ఉద్యోగాలు ఇవ్వడం పెద్ద స్కామ్ అని జగన్ తెలిపారు. కొత్త జీఓలు జారీ చేయడం.. ఉద్యోగాలు ఇవ్వడం..ఆ వెంటనే ఆ జీఓలు రద్దు చేస్తూ మరిన్ని జీఓలు ఇవ్వడం.. ఈ స్థాయిలో గతంలో ఎక్కడా అక్రమాలు జరగలేదని చెప్పారు. ఇంకా అదే బాటలో అటవీ ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం చేశారని, డీఎస్సీ స్కామ్ బయట పడడంతో 40 ఉద్యోగాలకు బ్రేక్ వేయడమే కాకుండా, మిగిలిన ఉద్యోగాలకూ నియామకాలు చేపట్టలేదని వెల్లడించారు. ఇది ఉద్యోగార్థులకు తీవ్ర అన్యాయం చేయడం కాదా? అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ప్రశ్నించారు.
ప్రశ్న–1:– రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, రాష్ట్ర డీఎస్సీ చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా, ప్రశ్నపత్రాల తయారీ, డీఎస్సీ పరీక్షల నిర్వహణ.. ఈ రెండు డ్యూటీలు ఒకే వ్యక్తి చేతిలో ఎందుకు పెట్టారు?. ఇక్కడే స్కామ్ ద్వారాలు తెరవబడ్డాయి. వీటికి సంబంధించి మేము ప్రశ్నిస్తే సమాధానం చెప్పరు.
ప్రశ్న–2:– ప్రశ్నపత్రాలు తయారుచేసే ఎస్సీఈఆర్టీ (స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్) విభాగంలో ఔట్ సోర్సింగ్లో పని చేసే నవీన్కు ఫస్ట్ ర్యాంక్ ఎలా వచ్చింది? ఆ వ్యక్తికి ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు? అతడి పేరున్న మెరిట్ లిస్టును ఎందుకు మార్చారు? రెండో లిస్టులో అతడి పేరు ఎందుకు లేదు?.
ప్రశ్న–3:– ఇంతకు ముందు ఉన్న స్పోర్ట్స్ కోటా జీఓను మార్చి, 372 పోస్టులు అసలు పరీక్ష కూడా రాయాల్సిన అవసరం లేకుండా మరో జీఓ ఎలా ఇచ్చారు. అలాగే 2 శాతం రిజర్వేషన్ను 3 శాతానికి పెంచారు. పరీక్ష కూడా అవసరం లేదని ఎందుకు చెప్పారు. ఆ మేరకు కొత్తగా జీఓ నెం:4 మరియ 47 జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్ష లేకుండా డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ చేయడానికి వీలు కల్పిస్తూ, ఈ రెండు జీఓలు ఎందుకు తెచ్చారు? ఈ రెండు జీఓలతో గేట్లు ఎత్తి, 372 మందిని రిక్రూట్ చేసి, పని అయిపోగానే, ఈ రెండు జీఓలు ఉపసంహరిస్తూ.. కొత్తగా జీఓ నెం:23, 25 మరియు 56 జారీ చేశారు. అంటే ఆ గేట్లు మూసేస్తూ, ఈ మూడు జీఓలు జారీ చేశారు.
ప్రశ్న–4:– టీచర్ పోస్టుల కోసం డబ్బులు తీసుకున్నారంటూ, ఆడియో, వీడియో కాల్స్ వివరాలు బయటకు వచ్చినా కూడా, దానిపై విచారణను ఎందుకు నిర్వీర్యం చేశారు. ఎఫ్ఐఆర్ నమోదైంది మొదలు, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపే వరకు కేసును మొత్తం నిర్వీర్యం చేశారు.
(అంటూ ఆ ఆడియో, వీడియో (ఫోన్ కాల్) మీడియాకు పీపీటీలో ప్రదర్శించి చూపారు)
ఇక్కడ చాలా స్పష్టంగా ఫోన్ నెం:94407 55843 కనిపిస్తోంది. ఆ నెంబర్ అంత స్పష్టంగా ఉన్నా, అది ఎవరిదో పోలీసులు కనుక్కోలేరా? పైగా ఎఫ్ఐఆర్లో ఏం రాశారు? పేరు రాయకుండా, సస్పెక్ట్ అని మాత్రమే రాశారు. అలాగే ఎందుకు ఆలస్యం అయిందంటే, ఉన్నతాధికారుల నుంచి క్లియరెన్స్ రాలేదని చెప్పారు.
పైగా దీనిపై చంద్రబాబు, ఆయన కుమారుడు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు చెప్పారు. ఆ వ్యక్తిని అరెస్టు చేసి, జైలుకు పంపామని చెప్పారు. కానీ, అది పచ్చి అబద్ధం. ఎందుకంటే అది క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకియంగ్ నెట్వర్క్ సిస్టమ్స్ (సీసీటీఎన్ఎస్)లో ఉంది.
ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు. కొన్ని కేస్ స్టడీస్:- అసలు ఈ కేసును సీబీఐకి ఎందుకివ్వాలి అంటే, ఆ స్థాయిలో అక్రమాలు జరిగాయి. యథేచ్ఛగా ఫేక్ స్పోర్ట్స్ సర్టిఫికెట్లు జారీ చేశారు. ఇందులో అంతులేని అక్రమాలు చేశారు.
జూడో కేటగిరీ:- ఈ డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 372 మందిని నియమిస్తే, ఒక్క జూడో కేటగిరీలోనే మొత్తం 39 మందికి పరీక్ష లేకుండానే పోస్టింగ్ ఇచ్చారు. వారిలో కొందరు సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ జూడో ఛాంపియన్షిప్ 2013లో ఖమ్మంలో జరిగినట్లు, వాటిలో తాము పాల్గొన్నట్లు సర్టిఫికెట్లు పెట్టారు.
అయితే ఆ పోటీలు తాము నిర్వహించలేదని, అవి అసలు జరగలేదని జిల్లా జూడో అసోసియేషన్, తెలంగాణ జూడో అసోసియేషన్ స్పష్టంగా చెప్పాయి. ఆ తేదీల్లో తామసలు ఏ పోటీలు నిర్వహించలేదని తేల్చి చెప్పాయి.
ఇక్కడ ఏపీ జూడో అసోసియేషన్ అధ్యక్షుడు మంత్రి నారా లోకేష్ తోడల్లుడు, విశాఖ ఎంపీ భరత్. అంటే దొంగ సర్టిఫికెట్లు సృష్టించడం, వాటి ద్వారా ఉద్యోగాలు ఇవ్వడం. ఇవన్నీ సాక్ష్యాలు, ఆధారాలతో చూపుతున్నాం.
సాఫ్ట్ బాల్:- సాఫ్ట్ బాల్ పేరిట మరో 38 మంది ఉద్యోగాలు ఇచ్చారు. ఆ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్. ఇక్కడ ఎంపికైన 38 మందిలో 21 సర్టిఫికెట్లు టీడీపీ ఎమ్మెల్యే కూన రవికుమార్ ఇచ్చారు.
ఫేక్ సర్టిఫికెట్స్. ‘శాప్’ వ్యవహారం:- విశాఖలో ఏ పరీక్ష రాయకుండానే, యోగేశ్వవరావు అనే అభ్యర్థికి స్పోర్ట్స్ కేటగిరీలో ఎస్జీటీ పోస్టు ఇచ్చారు. ఆయనకు ఒక్కడికే కాకుండా ఆయన చెల్లికి కూడా అదే కేటగిరీలో ఉద్యోగం ఇచ్చారు. ఇది ఫ్యామిలీ ప్యాకేజీ.
తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రకటించింది:- నల్లగొండలో జరిగిన 23వ సీనియర్ సౌత్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్ పోటీల్లో (2009) యోగేశ్వరరావు ఫస్ట్ ప్లేస్లో రాగా, ఆయన చెల్లి సెకండ్ ప్లేస్లో వచ్చినట్లు సర్టిఫికెట్లు ఇచ్చారు. అయితే వీరు అసలు విజేతల జాబితాలో లేరని, తెలంగాణ ఖోఖో అసోసియేషన్ ప్రకటించింది. ఆ మేరకు వివరాలు కూడా అసోసియేషన్ వెల్లడించింది.
(అంటూ ఆ వివరాలు ప్రెస్మీట్లో పీపీటీలో చూపారు)
మరో కేస్ స్టడీ:– బసవేశ్వరరావు స్పోర్ట్స్ కోటాలో జాబ్ పొందిన అభ్యర్థి. గుడివాడలో జరిగిన 49వ సీనియర్ ఖోఖో ఛాంపియన్షిప్లో పాల్గొన్నట్లు ఆయన సర్టిఫికెట్ దాఖలు చేస్తే, అది ఫేక్ది అని ఆంధ్ర ఖోఖో అసోసియేషన్, శాప్ అధికారులకు లేఖ ఇస్తే, దాన్ని పక్కన పడేశారు. చక్కగా ఉద్యోగం ఇచ్చారు. ఎందుకంటే, పై నుంచి ఫోన్. డీల్ కుదిరింది. కాబట్టి ఉద్యోగం ఇచ్చారు.
మరో కేస్ స్టడీ:- ప్రగడ కళ్యాణి. కబడ్డీలో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ గేమ్స్. 2003లో నాగార్జున యూనివర్సిటీలో పాల్గొన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చారు. దాని ఆధారంగా ఏ పరీక్ష లేకుండానే ఆమెకు ఉద్యోగం ఇచ్చారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే.. అసలు ఆ గేమ్స్ నాగార్జున వర్సిటీలో జరగలేదని, అక్కడ జరిగింది కేవలం సౌత్–వెస్ట్ జోన్ కబడ్డీ గేమ్స్ మాత్రమే అని ట్విస్ట్ బయట పడింది. కానీ, సెవెన్ స్టేజ్ వెరిఫికేషన్ చేసి, ఏ పరీక్ష రాయకుండానే ప్రభుత్వ ఉద్యోగం పొందారు. ఏడుసార్లు వెరిఫికేషన్ అంటే, ఎంత పకడ్బందీగా చేశారో చూడండి. అందుకే సీబీఐ విచారణ జరగాలని డిమాండ్ చేస్తున్నమన్నారు.

