వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతంగా, విజయవంతంగా నిర్వహించేందుకు చర్యలు-కలెక్టర్ హిమాన్షు శుక్ల
నెల్లూరు: వినాయక చవితి ఉత్సవాలను జిల్లాలో శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల ఆదేశించారు. మంగళవారం వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లు, భద్రతా చర్యలు, నిమజ్జన కార్యక్రమాల నిర్వహణ తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
18వ తేదీన నిమజ్జనం:- ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభమయ్యే వినాయక చవితి ఉత్సవాలు, 18వ తేదీన ఇరుగాలమ్మ గుడి సమీపంలోని గణేష్ ఘాట్, రంగనాథ స్వామి గుడి సమీపంలోని పెన్నా బ్రిడ్జి వద్ద నిమజ్జనానికి పకడ్బందీగా ఏర్పాటు చేయాలని, నిమజ్జన కార్యక్రమాలను ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు.
సింగిల్ విండో విధానంలో అనుమతులు:- వినాయక విగ్రహాల ఏర్పాటు కోసం పోలీసు, రెవెన్యూ, విద్యుత్, ట్రాఫిక్, మున్సిపల్ తదితర శాఖల అనుమతులు తప్పనిసరిగా తీసుకునేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. గణేష్ మండపాలకు అనుమతులు మంజూరు చేసే సమయంలో నిబంధనలు, భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించేలా చూడాలని ఆదేశించారు. సింగిల్ విండో విధానంలో అనుమతులను వేగంగా మంజూరు చేయాలని పోలీసులకు సూచించారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ విజయ్ కుమార్, ఏఎస్పీ సౌజన్య, ఆర్డీవో అనూష, వివిధ శాఖల అధికారులు, విక్రమ సింహపురి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

