ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమావేశం
ప్రపంచ దేశాల మధ్య ఆసక్తికర చర్చ…
అమరావతి: షాంఘై కో-ఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సు సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్తో కిర్గిజిస్థాన్ రాజధాని బిష్కెక్లో సోమవారం ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరిలో ఇరాన్-అమెరికా యుద్ధం ప్రారంభమైన తరువాత ఇరువురు నేతలు ప్రత్యక్షంగా కలుసుకోవడం ఇదే మొదటిసారి. భారత్-ఇరాన్ ద్వైపాక్షిక సంబంధాల తాజా పరిస్థితిపై ఇరువురు నేతలు సమీక్షించారు. పరస్పర ఆసక్తి ఉన్న రంగాల్లో రెండు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసి, విస్తరించాల్సిన అవసరం గురించి చర్చించారు. ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో ఈ కీలక సమావేశం జరగడం ప్రపంచ దేశాల మధ్య ఆసక్తికర చర్చగా మారింది.పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు, హోర్ముజ్ జలసంధి మూసివేత, ఇరాన్పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో మోదీ, పెజెష్కియాన్ ముఖాముఖి చర్చలు జరపడం రెండు దేశాల భవిష్యత్ సహకారానికి కీలక పరిణామంగా మారింది.
SCO సదస్సు సందర్భంగా మోదీ ఇప్పటికే అర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యాన్తో కూడా సమావేశమయ్యారు. రక్షణ, ఆర్థిక వ్యవహారాలు, ఫార్మా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సంస్కృతి, విద్య వంటి రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంపై ఇరు నేతలు చర్చించారు. అలాగే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో కూడా ప్రధాని మోదీ సమావేశం కానున్నారు.కిర్గిజిస్థాన్ అధ్యక్షుడు సదీర్ జపరోవ్ ఆహ్వానం మేరకు 6వ వరల్డ్ నోమాడ్ గేమ్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు.

