అస్సాంలోని 31 జైళ్లలో 4 నెలల వ్యవధిలో 200కు పైగా హెచ్ఐవి కేసులు నమోదు
అమరావతి: అస్సాంలోని పలు జైళ్లలో 200కు పైగా హెచ్ఐవీ కేసులు నమోదయ్యాయి. ఎయిడ్స్ సోకిన ఖైదీలకు యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) చికిత్స అందిస్తున్నారు. అస్సాం జైళ్లలోని ఖైదీలకు HIV సోకడం ఆందోళన కలిగిస్తున్నదని ఒక టీవీ చానల్ కి ఇచ్చిన ఇంటర్వులో ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు. జైళ్లలోని ఖైదీలకు మరిన్ని వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నదని చెప్పారు. అస్సాంలో సుమారు 33,000 మంది HIV లేదా ఎయిడ్స్ రోగులు ఉన్నారని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి అశోక్ సింఘాల్ వెల్లడించారు.
నాలుగు నెలల్లో 226 మంది ఖైదీలకు:- అస్సాంలోని జైళ్లలో HIV కేసుల సంఖ్య పెరుగడం ఆందోళన కలిగిస్తున్నది. (HIV) అస్సాంలో ఉన్న 31 జైళ్లలోని ఖైదీలకు HIV స్క్రీనింగ్ నిర్వహించారు. గత నాలుగు నెలల్లో 226 మంది ఖైదీలకు ఎయిడ్స్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. గత వారం శ్రీభూమి జిల్లా జైలులో HIV పాజిటివ్ ఖైదీల సంఖ్య పెరిగింది. ప్రస్తుతం ఈ జైలులో 445 మంది ఖైదీలు ఉండగా వారిలో 11 మందికి HIV పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ 11 మందిలో ఒక మహిళా ఖైదీ కూడా ఉన్నట్లు తెలుస్తున్నది. శ్రీభూమి జిల్లా జైలులో HIV కేసులు బయటపడటం జిల్లా వ్యాప్తంగా ఆందోళన రేకెత్తించింది.
ఇంజెక్షన్ ద్వారా మాదకద్రవ్యాలు:- అస్సాం జైళ్లలో HIV సోకిన 95 శాతం మంది ఖైదీలు ఇంజెక్షన్ ద్వారా మాదకద్రవ్యాలు తీసుకున్నవారేనని అధికారులు తెలిపారు. 31 జైళ్లలోని HIV పాజిటివ్గా ఉన్న 226 మంది ఖైదీలలో 202 మంది యాంటీ రెట్రోవైరల్ థెరపీ (ART) చికిత్స పొందుతున్నట్లు వివరించారు.

