నేపాల్ ఆకస్మిక వరదల్లో గల్లంతైన భారతీయుల వివరాలను ప్రకటించిన విదేశీ వ్యవహారాల శాఖ
అమరావతి: నేపాల్లో బుధవారం సంబంవించిన ఆకస్మిక వరదల్లో గల్లంతైన భారతీయుల వివరాలు అధికారికంగా తెలిశాయి. మొత్తం 288 మంది భారతీయులు నేపాల్ వరదల్లో గల్లంతైనట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. బాధితులకు, వారి కుటుంబాలకు అన్ని రకాలుగా సహాయం అందించేందుకు కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ఈ విషయమై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వివరాల్ని వెల్లడించారు.
పవర్ ప్రాజెక్టు కార్మికులు:- గల్లంతైన భారతీయులను ఐదు విభాగాలుగా గుర్తించారు. నేపాల్లో చేపడుతున్న త్రిశూలి-1 పవర్ ప్రాజెక్టు వద్ద పని చేస్తున్న భారతీయ కార్మికులు అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్లిన భారతీయులు. గల్లంతైన 288 మందిలో 73 మంది త్రిశూలి పవర్ ప్రాజెక్టు కార్మికులు.
యాత్రకు వెళ్లిన వారు:- 37 మంది సామ్రాట్ ట్రావెల్స్ ద్వారా తమిళనాడు నుంచి కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్లిన వారు. అలాగే, 49 మంది తమిళనాడులోని ఫ్లై ఎవరెస్ట్ ట్రావెల్స్ ద్వారా వెళ్లారు. 32 మంది పశ్చిమ బెంగాల్ నుంచి వెళ్లారు. వారు వరదలు సంభవించిన రసువా జిల్లాలోని తిమురే ప్రాంతంలోనే గల్లంతయ్యారు. 33 మంది కేరళ నుంచి ఉన్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు 61 మంది వరకు ఉన్నారు.
భారతీయ రాయబార కార్యాలయం:- నేపాల్ (ఖాట్మండ్)లో ఉన్న భారతీయ రాయబార కార్యాలయ అధికారులు, బాధితుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. స్థానిక అధికారులు, ఏజెన్సీలను సంప్రదిస్తూ, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. వరదల్లో 21 మంది భారతీయుల్ని అక్కడి అధికారులు రక్షించారు. 200 మంది వరకు టిబెట్ వద్ద చిక్కుకుపోయి వున్నారు. వారిని రక్షించే చర్యలు కూడా కొనసాగుతున్నాయి.అలాగే నేపాల్కు భారతదేశం మానవతా సాయాన్ని అందిస్తోంది. పరిస్థితులు తిరిగి సాధారణ స్థితికి వచ్చే వరకు సాయం అందించేందుకు సిద్దమని భారత్ ప్రకటించింది. బాధితులు సాయం కోసం కంట్రోల్ రూంను సంప్రదించాలని సూచించింది.
https://mea.gov.in/press-releases?dtl/41702


