22-A, చుక్కల భూములు, రీ సర్వే, PGRS అర్జీలను వేగవంతంగా పరిష్కరించండి-కలెక్టర్ హిమాన్షు శుక్ల
ఒక్క అర్జీ కూడా ఎస్ఎల్ఏ గడువు దాటకుండా..
22-A, చుక్కల భూముల కేసులను 15 రోజుల్లో..
ఇకపై ప్రతి వారం సమీక్ష..
వీళ్లల్లో మార్పు వస్తుందా?
నెల్లూరు: జిల్లాలో 22-A, చుక్కల భూములు, రీ సర్వే, పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఆర్డీవోలు, తహశీల్దార్లు, మండల సర్వేయర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో.. జేసి మొగిలి వెంకటేశ్వర్లు, డిఆర్వో విజయకుమార్ లతో కలసి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల 22-ఏ, డాటెడ్ ల్యాండ్స్, రీ సర్వే, పీజీఆర్ఎస్ అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
15 రోజుల లోపు:- ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన నియమ నిబంధనలకు అనుగుణంగా 22-ఏ, డాటెడ్ ల్యాండ్స్కు సంబంధించిన ప్రతి కేసును క్షుణ్ణంగా పరిశీలించి 15 రోజుల లోపు వేగవంతంగా పరిష్కరించాలన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా నిర్ణయాలు తీసుకోవాలని, ప్రతి కేసులో పూర్తి స్థాయి పరిశీలన అనంతరమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
ఒక్క అర్జీ కూడా ఎస్ఎల్ఏ గడువు దాటకుండా:- పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సూచించారు. ఒక్క అర్జీ కూడా ఎస్ఎల్ఏ గడువు దాటకుండా చర్యలు తీసుకోవాలని, అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను పూర్తిగా తెలుసుకొని, పారదర్శకంగా నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ఇకపై ప్రతి వారం సమీక్ష:- జిల్లాలో జరుగుతున్న రీ సర్వే పనుల పురోగతిని సమీక్షించిన జిల్లా కలెక్టర్, ఎలాంటి పెండింగ్ లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. రీ సర్వే ప్రక్రియలో నాణ్యతతో పాటు వేగం కూడా ఉండాలని, క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను వెంటనే పరిష్కరించి పనులను నిర్దేశిత కాలవ్యవధిలో పూర్తి చేయాలని సూచించారు.ఇకపై ప్రతి వారం సమీక్ష నిర్వహిస్తానని, ప్రతి అధికారి తన పరిధిలో స్పష్టమైన పురోగతి చూపించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు, తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

