రవాణాదారులు “ఏపీ ట్రాన్స్ పోర్ట్ కనెక్ట్” యాప్లో నమోదు చేసుకోండి-రవాణా శాఖ
నెల్లూరు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు (APMB),యూనిఫైడ్ లాజిస్టిక్స్ ఇంటర్ఫేస్ ప్లాట్ఫాం (ULIP) సంయుక్త ఆధ్వర్యంలో రూపొందిస్తున్న “ఏపీ ట్రాన్స్పోర్ట్ కనెక్ట్” మొబైల్ యాప్ ద్వారా రాష్ట్రంలోని లారీ యజమానులు, ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్లు, ఫ్లీట్ ఓనర్లు,ఇతర రవాణా సంస్థలను ఒకే డిజిటల్ లాజిస్టిక్స్ వేదికపైకి తీసుకురావడం లక్ష్యంగా పెట్టుకుందని రవాణా శాఖ బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వేదిక జాతీయ లాజిస్టిక్స్ వ్యవస్థతో అనుసంధానమై రవాణా రంగంలో పారదర్శకత, వేగం మరియు సౌలభ్యాన్ని పెంపొందించేందుకు రూపొందించబడింది.
ఈ యాప్లో నమోదు చేసుకోవడం ద్వారా రవాణాదారులు తమ వివరాలను ప్రభుత్వ ఆధారిత డిజిటల్ లాజిస్టిక్స్ వ్యవస్థలో నమోదు చేసుకునే అవకాశం లభిస్తుంది. భవిష్యత్తులో డిజిటల్ సేవలు, వేగవంతమైన ధృవీకరణ, తక్కువ పేపర్వర్క్, సులభమైన సమాచార మార్పిడి, విస్తృత వ్యాపార అవకాశాలను పొందేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అమలవుతున్న ULIP మరియు జాతీయ లాజిస్టిక్స్ విధానం లక్ష్యాలకు అనుగుణంగా చేపట్టబడుతోంది. జిల్లాలోని లారీ యజమానులు, ట్రాన్స్పోర్ట్ సంస్థలు, ఫ్లీట్ ఓనర్లు,అన్ని రవాణాదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని AP Transport Connect యాప్లో నమోదు చేసుకోవాలని రవాణా శాఖ విజ్ఞప్తి చేసింది.
యాప్లో నమోదు, వివరాలు-ఇతర సమాచారానికి: https://transportconnect.ap.gov.in/

