ప్రపంచ పోలీస్ క్రీడల్లో బంగారు,కాంస్య పతకాలు సాధించిన టీటీడీ
అమరావతి: అమెరికాలోని బర్మింగ్హామ్ నగరంలో జరిగిన ప్రపంచ పోలీస్, ఫైర్ గేమ్స్-2025 పోటీల్లో టీటీడీ సెక్యూరిటవిజిలెన్స్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు తమ క్రీడా ప్రతిభను ప్రదర్శిస్తూ అద్భుత విజయాలు సాధించి జాతీయ మువ్వెన్నల పతాకాన్ని రెపరెపలాడించారు. 45 సంవత్సరాల పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీలో టీటీడీ విజీవో ఎ.సురేంద్ర స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా,, 55 సంవత్సరాల పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీలో వీజీవో ఎన్టీవీ రామ్ కుమార్ కాంస్య పతకాన్ని సాధించారు.ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ బీ.ఆర్.నాయుడు, టీటీడీ ఈవో జె.శ్యామలరావు విజేతలను అభినందించారు. ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల పోలీస్, ఫైర్ విభాగాల నుంచి 9,000 మంది అథ్లెట్లు పాల్గొన్న ఈ ద్వైవార్షిక పోటీల్లో టీటీడీ అధికారుల విజయాలు దేశానికే గర్వకారణమని, టీటీడీకి ఇది ఒక గొప్ప గౌరవంగా నిలిచిందని కొనియాడారు.