సీడ్ బాల్స్ వెదజల్లడంతోపాటు మొలకలకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకోవాలి-పవన్ కళ్యాణ్
వెయ్యి ఎకరాల్లో డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్..
అమరావతి: వర్షపాతం, నేలలో తేమ వంటి వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఉపముఖ్యమంత్రి,అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.శనివారం సీడ్ బాల్స్ పంపిణీ, వెదజల్లే కార్యక్రమం, డ్రోన్ సాంకేతికత వినియోగంపై అటవీశాఖ ఉన్నతాధికారులతో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ సమీక్షించారు. అడవులు క్షీణించిన ప్రాంతాల్లో సీడ్ బాల్స్ జారవిడిచే కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు మరిన్ని డ్రోన్ల సహాయం తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో అటవీ పునరుద్ధరణ, 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్యాల్లో సీడ్ బాల్స్ పంపిణీ కార్యక్రమం అత్యంత కీలక ప్రక్రియ అని తెలిపారు.
ఇప్పటి వరకు 63 లక్షలకు పైగా:- రాష్ట్రవ్యాప్తంగా 3 కోట్లకు పైగా సీడ్ బాల్స్ సిద్ధం చేయగా, ఇప్పటి వరకు 63 లక్షలకు పైగా సీడ్ బాల్స్ దాదాపు 6,500 హెక్టార్ల విస్తీర్ణంలో వెదజల్లే ప్రక్రియ పూర్తి చేసినట్టు అధికారులు తెలిపారు. అందులో మానవ వనరుల సాయంతో సుమారు 6 వేల హెక్టార్ల పరిధిలో 59 లక్షల సీడ్ బాల్స్ వెదజల్లినట్టు, మొట్టమొదటి సారి డ్రోన్ల సాయంతో అడవుల్లో లోయ ప్రాంతాలకి వెళ్లి సీడ్ బాల్స్ జారవిడిచినట్టు వివరించారు. సుమారు వెయ్యి ఎకరాల్లో డ్రోన్స్ ద్వారా సీడ్ బాల్స్ జార విడిచినట్లు తెలిపారు.అత్యధికంగా రాజమహేంద్రవరం సర్కిల్ పరిధిలో దాదాపు 28 లక్షల సీడ్ బాల్స్ వెదజల్లగా, అందులో డ్రోన్ సాయంతో 2.26 లక్షలు జారవిడిచినట్టు అధికారులు చెప్పారు.
ఎల్ నినో వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు:- ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గా మాట్లాడుతూ “ఎల్ నినో వల్ల ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు సీడ్ బాల్స్ వెదజల్లే ప్రక్రియకు కొంత మేర ఇబ్బందులు కలిగించవచ్చు. వర్షాలు కురుస్తున్న ప్రాంతాల్లో మాత్రం జాప్యానికి తావు లేకుండా సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని కొనసాగించాలి. అవసరం అయితే డ్రోన్ల సంఖ్య పెంచే విధంగా చర్యలు తీసుకోండి. అటవీ ప్రాంతాల్లో పచ్చదనం తగ్గిన చోట కచ్చితంగా అడవి పునరుద్ధరణ మొదలవ్వాలి. మానవ వనరులతో సీడ్ బాల్స్ వెదజల్లిన ప్రాంతాల్లో మొలకలు వస్తే, వాటిని సంరక్షించడం కోసం తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

