125 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయ అభివృద్ధికి కృషి చేయండి-మంత్రి నారాయణ
నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం..
నెల్లూరు: నగరంలోని 125 సంవత్సరాల చరిత్ర కలిగిన సంతపేట శ్రీ ఆంజనేయస్వామి ఆలయ నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవం శనివారం జరిగింది. మంత్రి నారాయణ దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.సతీమణి రమాదేవితో కలిసి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు మంత్రి దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
నూతన పాలకమండలి చైర్మన్ ముప్పాళ్ల విజేతా రెడ్డి, సభ్యులు శివ ప్రదీప్, జీత్ సింగ్, చైతన్య, విజయ్కుమార్, లతేష్, శిల్పా, శిరీషాతో పాటు ఎక్స్ అఫీషియో సభ్యులను మంత్రి దంపతులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ 125 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ పవిత్ర క్షేత్రం నూతన పాలకమండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. బాధ్యతలు స్వీకరించిన చైర్మన్ ముప్పాళ్ల విజేతా రెడ్డి, సభ్యులు స్వామివారి ఆశీస్సులతో ఆలయ అభివృద్ధికి అంకితభావంతో కృషి చేయాలని ఆకాంక్షించారు.
1891లో ఆలయ నిత్య నైవేద్యాల కోసం భూదానం చేసిన రంగారావు, జింక వాహనోత్సవం కోసం తన ఇంటిని దానం చేసిన ములుమూడి సుబ్బమ్మ చేసిన సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు. వారి త్యాగస్ఫూర్తి భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్, నారాయణ విద్యాసంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనూరాధ, రాష్ట్ర వేర్హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాసులు, టీడీపీ మహిళా నేత కపిర రేవతి, బీజేపీ నేతలు సురేంద్రరెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, జనసేన నేత దుగ్గిశెట్టి సుజయ్బాబు, టీడీపీ నేతలు కిన్నెర ప్రసాద్, డీవీఎస్ గిరి తదితరులు పాల్గొన్నారు.

