ప్రజారోగ్య భద్రతే లక్ష్యంగా రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు నుంచి సంజీవని- సీ.ఎం చంద్రబాబు
అమరావతి: ప్రజారోగ్యం కోసమే సంజీవని పథకాన్ని అందిస్తున్నామని…ఆగస్టు నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మీ ఆరోగ్యం… మీ చేతుల్లో ఉంటుందని… ప్రభుత్వం అందించే సంజీవని పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీఎం చంద్రబాబు ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలోని ఆస్పరిలో నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణ కోసం సాంకేతికతను జోడిస్తూ రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్న సంజీవని ప్రాజెక్ట్ ప్రత్యేకతలను సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ… విద్య, వైద్యం మీదే ప్రతి కుటుంబం అత్యధికంగా ఖర్చు చేస్తున్న పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్య బాధ్యతను ప్రభుత్వమే తీసుకునేలా సంజీవని ప్రాజెక్టును రూపొందించామని సీఎం తెలిపారు. ఆగస్టు నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు కానున్న ఈ కార్యక్రమంలో ప్రతి వ్యక్తికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించి.. కుటుంబ సభ్యులందరికీ ఆభా హెల్త్ ఐడీలు జారీ చేస్తామని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం ఆరోగ్య సమాచారాన్ని ఒకే వేదికపై అనుసంధానం చేస్తామని వివరించారు.

