కూరగాయాల మార్కెట్ ప్రాంతాలలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు-కమీషనర్
జరిగే పనేనా??
నగరపాలక సంస్థ కమీషనర్ గా మీరు, నగర ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో వుంచుకుని,కూరగాయాల మార్కెట్ పరిధిలో రోడ్లను అక్రమించుకుని అడ్డగొలుగా వ్యాపారం చేస్తున్న వారికి కట్టడి చేసేందుకు ప్రయత్నించడం మంచిదే..అయితే ఇక్కడ చిక్కు అంతా, రాజకీయా నాయకుల నుంచి వెంటనే మీకు ఫోన్లు వస్తాయి? మన వాళ్లే చూసి చూడనట్లు పొండి…నగర ప్రజలు కొన్ని గంటలు ఇబ్బందులు పడితే పెద్ద సమస్యే కాదు అన్న చందాన మాటలు వుంటాయి అనేది జగమెరిగిన సత్యం..గతంలో కూడా మీలాగే ఒక కమీషనర్ ప్రయత్నిస్తే…గతం ప్రభుత్వంలో ఎం.పీగా వున్న వ్యక్తి…. వారి జోలికి పోవద్దు అంటూ హుకుం జారీ చేశాడు. మీరు బాధ్యతలు చేపట్టిన తరువాత మూడు,నాలుగు నెలల క్రిందట ఇదే విధంగా మార్కెట్ ప్రాంతంలో రోడ్లపై వ్యాపారాలు చేసే వారిని కట్టడి చేసేందుకు ప్రయత్నించారు అనే విషయం నగర ప్రజల దృష్టిలో వుంది. పట్టు వదలని విక్కమార్కుడిలా మీరు చేసే ప్రయత్నం ఫలించాలని ఆశిస్తున్నాం..నగర పౌరులు….
నెల్లూరు: నగరపాలక సంస్థ కమిషనర్ వై.ఓ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా వివిధ విభాగాల అధికారులతో కలిసి సోమవారం స్థానిక ఏసి సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్, మురళీకృష్ణ హోటల్ పరిసర ప్రాంతాలలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలను చేపట్టారు. మార్కెట్ ప్రాంగణం పరిధిలో నిర్దేశించిన మార్కింగ్ను దాటి వీధి వ్యాపారస్తులు ఎక్రయాల జరపకుండా కఠిన చర్యలు తీసుకోవాలని నిరంతరం ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పర్యవేక్షించాలని సూచించారు కూరగాయల మార్కెట్ వ్యాపారస్తులు దుకాణాలకు ఎదురుగా రవాణాకు ఇబ్బందికరంగా స్టాక్ ఏర్పాటు చేసుకోవడం, చెడిపోయిన కూరగాయలను రోడ్లపై పారవేయడం తదితర చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని కమిషనర్ హెచ్చరించారు.
వీధి వ్యాపారస్తులు రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేయకుండా, రోడ్లపై, బహిరంగ ప్రదేశాలలో వ్యర్ధాలను వేయకుండా సంబంధిత విభాగాల అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఎస్.ఈ రహంతు జానీ, ఈ.ఈ శేషగిరిరావు, టౌన్ ప్లానింగ్ విభాగం సిటీ ప్లానర్ రఘునాథ రావు, ట్రాఫిక్ పోలీసు విభాగం ఇన్స్పెక్టర్లు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు.

