భారత నౌకాదళ అమ్ముపొదలో చేరిన ఐఎన్ఎస్ “తారాగిరి స్టీల్త్ ఫ్రిగేట్”
అమరావతి: భారత నౌకాదళ అమ్ముపొదలో దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన అత్యాధునిక యుద్ధనౌక ‘INS తారాగిరి’ శుక్రవారం విశాఖపట్నంలో జలప్రవేశం చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన కమిషనింగ్ వేడుక ఆహ్లాదకరంగా సాగింది.తారాగిరి జలప్రవేశంతో భారతదేశ సముద్ర సరిహద్దుల రక్షణలో మరో సరికొత్త చరిత్ర మొదలైంది. స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ‘ప్రాజెక్ట్ 17A’ శ్రేణిలోని యుద్ధనౌక అధికారికంగా భారత నౌకాదళంలో చేరింది. అత్యాధునిక యుద్ధనౌక చేరికతో తూర్పు నౌకాదళం మరింత పటిష్ఠం మారింది.
స్టీల్త్ ఫ్రిగేట్:– శత్రువుల రాడార్లకు చిక్కకుండా ప్రయాణించగలిగే ‘స్టీల్త్’ టెక్నాలజీతో దీనిని రూపొందించారు. ముంబైలోని మజాగాన్ డాక్ షిప్బిల్డర్స్ లిమిటెడ్ (MDL) దీనిని నిర్మించింది.’INS తారాగిరి’ ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా నిర్మించిన అత్యంత శక్తివంతమైన నౌకలలో ఒకటి. సముద్రం నుంచి ఆకాశంలోకి, సముద్రం నుంచి సముద్రంలోకి దాడి చేయగల క్షిపణులు (Missiles), అత్యాధునిక సెన్సార్లు, శక్తివంతమైన తుపాకులతో దీనిని అమర్చారు. దాదాపు 149 మీటర్ల పొడవు, 17.8 మీటర్ల వెడల్పు గల ఈ నౌక గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా కదలికలు పెరుగుతున్న నేపథ్యంలో, INS తారాగిరి కమిషనింగ్ అత్యంత కీలకంగా మారింది.

