“వందేమాతరం” “సర్క్యులర్ సలహా పూర్వకమైనదే తప్ప తప్పనిసరి” కాదు-సుప్రీం
పిటిషన్ను కొట్టివేత..
అమరావతి: ప్రభుత్వానికి సంబంధించిన అధికారిక కార్యక్రమాల్లో జాతీయ గేయం “వందేమాతరం” పాడాలంటూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సదరు పిటిషన్పై విచారణ జరిపేందుకు దేశ సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఆ “సర్క్యులర్ కేవలం సలహా పూర్వకమైనదే తప్ప తప్పనిసరి” కాదని స్పష్టంచేసింది.ప్రభుత్వ ఉత్తర్వులలో ఎలాంటి శిక్షార్హమైన చర్యలు పేర్కొననందున ఈ పిటిషన్పై విచారణ తొందరపాటు అవుతుందని కోర్టు అభిప్రాయపడింది. భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, జస్టిస్ జాయ్మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్పై విచారణ జరిపింది.2026 జనవరి 28న కేంద్రం జారీచేసిన నోటిఫికేషన్ కేవలం సలహా మాత్రమేనని, దాన్ని పాటించకపోతే శిక్షలు ఉంటాయని ఎక్కడా చెప్పలేదని ధర్మాసనం పేర్కొన్నది.
పిటిషన్ను కొట్టివేత:- ఒకవేళ శిక్షార్హమైన చర్యలు తీసుకుంటే లేదా దాన్ని తప్పనిసరి చేస్తే అప్పుడు విచారిస్తామని, ప్రస్తుతానికి దానిలో అలాంటివేమీ లేవని కోర్టు వ్యాఖ్యానించింది. “పిటిషనర్ ముహమ్మద్ సయీద్ నూరి” తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే.. సర్క్యులర్లో శిక్షలు లేకపోయినా ఇది పరోక్ష ఒత్తిడికి దారితీస్తున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. వందేమాతరం పాడటానికి లేదా గౌరవ సూచకంగా నిలబడటానికి నిరాకరించే వారు సామాజిక వివక్షను ఎదుర్కొనే ప్రమాదం ఉందని వాదించారు. అయితే పిటిషనర్ వ్యక్తం చేస్తున్న ఆందోళనలు ప్రస్తుతానికి ఊహాజనితమేనని ధర్మాసనం అభిప్రాయపడింది. ఒకవేళ ఎవరిపైనైనా శిక్షార్హమైన చర్యలు తీసుకున్నా లేదా వివక్ష చూపినా, అప్పుడు మళ్లీ కోర్టును ఆశ్రయించవచ్చని పిటిషనర్కు సూచిస్తూ పిటిషన్ను కొట్టివేసింది.
1950లో జాతీయ గేయం హోదా:- ఆ సర్క్యులర్ కేవలం జాతీయ గేయంపై గౌరవాన్ని పెంపొందించడానికేనని, చట్టబద్ధంగా అమలు చేయాలనే ఉద్దేశం లేదని ప్రభుత్వం స్పష్టంచేసింది. వందేమాతరం స్ఫూర్తి గురించి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభలో ప్రస్తావించారు. బంకించంద్ర చటోపాధ్యాయ 1875లో రాసిన ఈ గేయం.. స్వాతంత్ర్య పోరాటంలో ప్రజలను ఏకతాటిపై నడిపించిందని కొనియాడారు. ఈ గేయానికి 1950లో అప్పటి రాష్ట్రపతి బాబూరాజేంద్రప్రసాద్ జాతీయ గేయం హోదా కల్పించారు.

