యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ అకృత్యాలు!
రహస్య కెమెరాల ద్వారా…
అమరావతి: యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ అకృత్యాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. పోలీసులు అతని ఫోన్ డేటాలో కీలక ఆధారాలు గుర్తించినట్లు తెలుపుతున్నారు. ఈ నెల 2వ తేదిన సర్పవరం పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. కాకినాడ జిల్లాలో అరెస్టయిన సమయంలో ఫోన్ డేటాను విశ్లేషించిన పోలీసులు, డిలీట్ చేసిన డేటా కోసం ఫోన్ను ల్యాబ్కు పంపించారు. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రహస్య కెమెరాల ద్వారా:- రావణ్ మహిళలతో సన్నిహితంగా ఉన్నట్లు కనిపించే వీడియోలను పోలీసులు గుర్తించారు. హైదరాబాద్లోని తన స్టూడియోలో రహస్య కెమెరాల ద్వారా ఈ వీడియోలు చిత్రీకరించినట్లు ?? విచారణలో బయటపడింది. డేటా ఆధారంగా దాదాపు 10 మంది బాధితులను గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కోణంలోనూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. నిందితుడి ఫోన్ డేటాపై కాకినాడ జిల్లా పోలీసులు లోతైన విచారణ చేపట్టారు. ఈ వీడియోల ద్వారా మహిళలను రావణ్ బ్లాక్మెయిల్ చేసినట్లు ఆధారాలు లభించాయని పోలీసులు తెలిపారు. ప్రతి నెలా బ్లాక్మెయిల్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నట్లు నిర్ధారించారు. ఈ వ్యవహారంలో బాధితులైన మహిళలు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని, వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం రావణ్ పై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో సుమారు 35 కేసులు నమోదయ్యాయి.
18 వరకు రిమాండ్:– ఈ నెల 5వ తేదిన గన్నవరం పోలీసులు యూట్యూబర్ రావణ్పై దేశ సార్వభౌమాధికారం, ఐక్యత, సమగ్రతకు భంగం కలిగిస్తూ దేశద్రోహానికి పాల్పడ్డారంటూ (భారత న్యాయ సంహిత) BNSలోని 152 సహా పలు సెక్షన్లు, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టంలోని (ఉపా) సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. ఆదివారం సాయంత్రం రావణ్ను కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి ఈనెల 18 వరకు రిమాండ్ విధించారు.

