బాణసంచా పరిశ్రమలో పేలుడు-18 మంది మృతి
అమరావతి: తమిళనాడులోని ఓ ప్రైవేటు బాణాసంచా కర్మాగారంలో ఘోర ప్రమాదం సంభవించింది. విరుద్ నగర్ సమీపంలోని కట్టనార్పట్టిలో ఉన్న ఓ బాణసంచా తయారీ పరిశ్రమలో ఆదివారం మధ్యాహ్న సమయంలో ఫ్యాక్టరీలో భారీ పేలుడు జరగడంతో 18 మంది మరణించగా, పలువురు తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. బాణాసంచా పేలుడు ధాటికి కలిగిన ప్రకంపనలు 10 కి.మీ దారం వరకు విస్తరించాయని స్థానికులు చెబుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం సహాయక చర్యలు చేపట్టారు. పేలుడు ధాటికి బాణాసంచా తయారీ పరిశ్రమ పూర్తిగా ధ్వంసమైంది. పేలుడు తీవ్రతకు పరిసరాలు కంపించిపోయాయి. సమీప ప్రజలు భయాందోళనతో పరుగులు తీశారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో 30 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం.

