కోవూరు షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలు చెల్లించి ఆదుకోండి-ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి
అమరావతి: కోవూరు షుగర్ ఫ్యాక్టరీ 15 సంవత్సరాల నుంచి మూతపడడంతో,వేలాది కార్మికుల కుటుంబాలను రోడ్డున పడ్డాయని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి.ప్రశాంతిరెడ్డి శాసనసభలో సోమవారం ప్రస్తవించారు. కోవూరు షుగర్ ఫ్యాక్టరీలో దాదాపు 3 వేల మంది కార్మికులు పని విదులు నిర్వహించేవారని, న్యాయం కోసం పోరాడుతూ ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటి వరకు సుమారు 2 వేల మంది వరకు మరణించడం అత్యంత బాధాకరమంటూ కార్మికుల దయనీయ స్థితిని సభలో ప్రస్తావించారు. ప్రస్తుతం జీవించి ఉన్న దాదాపు 1000 మంది వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బకాయిల కోసం ఎదురు చూస్తున్నారని, షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల దయనీయ పరిస్థితులపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.15 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కోట్లాది రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేసి కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ఎమ్మెల్యే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి-పరిశ్రమల శాఖ మంత్రి మానవతా దృక్పథంతో సానుకూలంగా స్పందించి షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల బకాయిలను త్వరితగతిన చెల్లించి ఆదుకోవాలని ఎమ్మెల్యే ప్రశాంతి మనవి చేశారు.

