నగర పాలక సంస్థ ప్రత్యేక సర్వసభ్య- అన్ని అంశాలు అమెదం-ఇన్ చార్జ్ మేయర్
మాజీ మేయర్ స్రవంతి నిరసన..
నెల్లూరు: నగర పాలక సంస్థ ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని కార్పొరేషన్ కార్యాలయంలోని డాక్టర్ ఎ.పి.జె అబ్దుల్ కలామ్ కౌన్సిల్ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించారు. ఇన్ చార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నగర పాలక సంస్థ అన్ని డివిజనుల కౌన్సిల్ సభ్యుల సమక్షంలో 14 మెయిన్ అజెండా, 13 సప్లిమెంటరీ అజెండా, 11 టేబుల్ అజెండాలుగా మొత్తం ప్రవేశపెట్టిన 38 తీర్మానాలను అజెండాగా ప్రకటించగా, అన్ని తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించారు. ఈ సందర్భంగా ఇన్ చార్జ్ మేయర్ మాట్లాడుతూ అజెండాలోని అన్ని అంశాలు ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన, ఆరోగ్య భద్రత, నగరాభివృద్ధి ధ్యేయంగా రూపొందించబడినవని, అన్ని డివిజన్లకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను అజెండాలో పొందుపరిచామని తెలిపారు.
భూగర్భ డ్రైన్ కనెక్షన్:- ప్రధానంగా దోమల నివారణ కోసం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్త చర్యలను నగరపాలక సంస్థ పరిధిలో ప్రణాళిక బద్ధంగా చేపట్టేందుకు కార్యచరణ రూపొందించి అమలు చేస్తున్నామని తెలిపారు. భూగర్భ డ్రైన్ కనెక్షన్ కు ప్రతి ఒక్క గృహం అనుసంధానించేలా అవగాహన కల్పించాలని స్థానిక కార్పొరేటర్ లకు మేయర్ సూచించారు. నగర అభివృద్ధికి అవసరమైన మూలధనం ఏర్పాటు కోసం ప్రభుత్వం రూపొందించిన బి.పి.ఎస్, ఎల్.ఆర్.ఎస్ పరకాలపై స్థానిక ప్రజలందరికీ అవగాహన కల్పించి ఆయా పథకాలను సద్వినియోగం చేసుకునేలా స్థానిక కార్పొరేటర్లు కృషి చేయాలని మేయర్ సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ సయ్యద్ తహసీన్, కో ఆప్షన్ సభ్యులు, నగర పాలక సంస్థ డివిజనుల కార్పొరేటర్లు, కమిషనర్ వై.ఓ నందన్, నగర పాలక సంస్థ అన్ని విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మేయర్ పీఠం పై ఇంచార్జ్ మేయర్ రూప్ యాదవ్:-
ST జనరల్ కేటగిరీ కి కేటాయించిన మేయర్ పదవి ని అన్యాయంగా తనను దించేసి రూప్ కుమార్ యాదవ్ కూర్చోవడం పై మాజీ మేయర్ పోట్లూరు స్రవంతి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్లకార్డులతో మేయర్ పోడియం వద్ద నిరసన తెలిపారు. వైసీపీ కార్పొరేటర్లు,స్రవంతికి మద్దతుగా నిరసనలో పాల్గొన్నారు. గత కొద్ది రోజులుగా ST లకు చెందాల్సిన మేయర్ పీఠం పై కూటమి కుట్రలు పన్ని తనను తొలగించారు అని మాజీ మేయర్ మండిపడ్డారు.

