గొల్లపూడి మార్కెట్ యార్డ్లో ఆకస్మిక తనిఖీలు చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి: ఎన్టీఆర్ జిల్లాలో ధాన్యం కొనుగోలు మరియు రైతులకు కలిగే ప్రయోజనాలపై సమీక్షలో భాగంగా రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాలు,,ఆహార శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గొల్లపూడి మార్కెట్ యార్డ్ ను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ ఉన్న రైతులతో ప్రత్యక్షంగా మాట్లాడారు.. ధాన్యం తేమ శాతం కొలిచే యంత్రాలను స్వయంగా తనిఖీ చేశారు. రైతులను ఇబ్బంది పెట్టే రైస్ మిల్లులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. “ప్రతి ధాన్యపు బస్తాను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది. రైతులకు నష్టం, కష్టం కలిగిస్తే సహించము. గిట్టుబాటు ధర లభించకపోతే, తరుగు, తేమ శాతం పేరుతో ఎవరైనా రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవు” అని మంత్రి స్పష్టం చేశారు. బుడమేరు వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తి సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలోని 18 రైస్ మిల్లర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, రైతులకు అండగా నిలబడతామని తెలిపారు.ఈ తనిఖీలలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీమతి లక్ష్మీష, మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు.