ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసిన డొనాల్డ్ ట్రంప్
అమరావతి: అమెరికా,ఇజ్రాయిల్-ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్దం కారణంగా తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. పశ్చిమాసియాలో పరిస్థితులు, భారత్-అమెరికా ద్వైపాక్షిక సహకారం, హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం గురించి వీరి మధ్య చర్చ జరిగిందన్న విషయాన్ని ప్రధాని మోదీ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి చర్చలు విఫలమైన తరువాత ప్రధాని మోదీతో ట్రంప్ మాట్లాడడం ప్రాధాన్యం సంతరించుకుంది. మిత్రుడు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతిని సమీక్షించుకున్నాం. అన్ని రంగాలలో సమగ్ర అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కట్టుబడి ఉన్నాం. పశ్చిమాసియాలోని పరిస్థితి గురించి కూడా చర్చించాం. హోర్ముజ్ జలసంధిని తెరవడం, సురక్షితంగా ఉంచడం గురించి మాట్లాడుకున్నాం’ అని ప్రధాని మోదీ వెల్లడించారు.

అమెరికా రాయబారి సెర్గియా గోర్:- భారత ప్రధాని, అమెరికా అధ్యక్షుడు మధ్య జరిగిన సంభాషణ గురించి భారత్లోని అమెరికా రాయబారి సెర్గియా గోర్ స్పందించారు. ఇద్దరు నేతల మధ్య సంభాషణ చాలా సానుకూలంగా, ఫలవంతంగా సాగిందని చెప్పారు. వీరిద్దరూ 40 నిమిషాల పాటు వివిధ అంశాల గురించి మాట్లాడుకున్నారని తెలిపారు. పశ్చిమాసియాలో పరిస్థితి గురించి ప్రధాని మోదీకి, ట్రంప్ సమాచారం అందించారని తెలిపారు. శాంతి ప్రక్రియలో న్యూఢిల్లీ ప్రమేయాన్ని అమెరికా స్వాగతిస్తుందని గోర్ అన్నారు.

