క్షేత్రస్థాయిలో పరిశీలనతోనే సమస్యలకు పరిష్కారం-జిల్లా ప్రత్యేక అధికారి
నెల్లూరు: వినూత్న ఆలోచనలు, టీం వర్క్ తో జిల్లా అభివృద్ధికి అధికారులు కృషి చేయాలని,జిల్లాలోని వనరులను, ప్రజావసరాలను గుర్తించి అన్ని స్థాయిల్లోని డేటాను అనుసంధానం చేసి జిల్లాను అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని జిల్లా ప్రత్యేక అధికారి డా.ఎన్.యువరాజ్ అధికారులకు సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమన్వయం చేసేందుకు నియమించిన జిల్లా ప్రత్యేక అధికారి, పరిశ్రమలు, వాణిజ్య శాఖల కార్యదర్శి యువరాజ్ శుక్రవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో వివిధ శాఖల జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు.తొలుత జిల్లా కలెక్టర్ ఆనంద్ వివిధ రంగాల్లో జిల్లా ప్రగతిని ఆయనకు తెలియజేశారు.ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి యువరాజ్ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పరిశీలన ద్వారా మాత్రమే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని, కిందిస్థాయిలో అధికారులు చేసిన ప్రయోగాల ద్వారా మాత్రమే ఉన్నతంగా తీర్చిదిద్దుతాయన్నారు. జిల్లాలోని అధికారులతో స్ట్రాటజిక్ కోర్ గ్రూప్ ను తయారుచేసి ప్రజావసరాలను తెలుసుకొని, అందుబాటులో ఉన్న వనరులతో జిల్లాను అన్ని రంగాల్లో అత్యుత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలన్నారు.జిల్లాలోని పుణ్యక్షేత్రాలు, బీచ్, ఇతర ప్రముఖ ప్రాంతాలను అనుసంధానం చేస్తూ టూరిజం ప్యాకేజీ నిర్వహణకు చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే నేటి యువత ట్రెక్కింగ్ చేసేందుకు ఆసక్తిగా ఉన్న దృష్ట్యా, అటవీ ప్రాంతంలో ట్రెక్కింగ్ కు ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె. కార్తీక్, కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ పూజ , డిఆర్ఓ ఉదయ భాస్కరరావు, ఆర్డీవోలు అనూష, వంశీ కృష్ణ, పావని, అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.