పి.ఎం సూర్యఘర్ పథకం ద్వారా ప్రతి ఇల్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం-దినకర్
నెల్లూరు: భారత ప్రధాని, ఆంధ్రప్రదేశ్ సీ.ఎం కలలు కంటున్న వికసిత భారత్, స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో భాగంగా వివిధ పధకాల అమలుకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ దినకర్ సంబంధిత అధికారులకు సూచించారు. శుక్రవారం నగరంలోని జెడ్పి హాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పధకాలను జిల్లా కలెక్టర్ ఆనంద్ తో కలసి సమీక్షించారు.
అనంతరం 20 సూత్రాల కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ మాట్లాడారు. ఉపాధిహామీపథకం మెటీరియల్ కాంపోనెంట్ వినియోగం, జల్ జీవన్ మిషన్ అమలు తీరు, అమృత్ పథకం నిధుల వినియోగంతో సాధించిన ఫలితాలు, అమృత్ 2.0 లక్ష్యాలు, గ్రామీణసడక్ యోజన, లాక్ పతి దీదీ, గరీబ్ కళ్యాణ్ అన్నయోజన, పీఎంసూర్యఘర్, కుసుమ్, పీఎంఆవాసయోజన, పీఎం విశ్వకర్మ యోజన వంటి కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరుతో పాటు, జిల్లాను ఎలక్ట్రానిక్ హబ్ గా, వస్తు తయారీ కేంద్రంగా మలచడానికి ప్రణాళికలు రచించడం, జిల్లాలో పారిశ్రామికీకరణ అభివృద్ధి తదితర అంశాల పైన జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో సమీక్ష చేయడం జరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి వివిధ పథకాలకు మంజూరవుతున్న నిధులు అర్హులైన అందరికీ అందాలన్నారు. అదేవిధంగా పి.ఎం సూర్యఘర్ యోజన పథకం ద్వారా ప్రతి ఇంటిని విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మార్చాలనే ఉద్దేశంతో తయారు చేశారని, ఇందుకోసం విద్యుత్తు, సెర్ప్, మెప్మా, మున్సిపల్ శాఖల అధికారులు సంయుక్తంగా నిర్ణీత లక్ష్యసాధనకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా మేలురకం పశువుల సంతాన ఉత్పత్తి పెంచడం, ఆవులు , గేదెలను సబ్సిడీ పైన రుణాలు అందించడం ద్వారా పాల ఉత్పత్తి పెంచి గ్రామీణులకు అదనపు ఆదాయం చేకూర్చడానికి కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుందన్నారు.ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.