నాంపల్లి క్రిమినల్ కోర్టు భవనంలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: హైదరాబాద్లోని నాంపల్లి క్రిమినల్ కోర్టు భవనంలోని మూడో అంతస్తులో సోమవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఇది గమనించిన సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అగ్నిమాపక సిబ్బంది వేగంగా స్పందించడంతో, ఇతర అంతస్తులకు మంటలు వ్యాపించకుండా నిరోధించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్తి నష్టం ఎంతమేరకు జరిగిందనే అంశాలపై అధికారులు విచారణ చేపట్టారు.

