తాజ్ మహల్ వివాదం-కేంద్ర ప్రభుత్వం, ASI నుంచి వివరణ కోరిన అలహాబాద్ హైకోర్టు
అమరావతి: తాజ్ మహల్ వివాదానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. తాజ్ మహల్ను ‘తేజో మహాలయ’ అనే ప్రాచీన హిందూ దేవాలయంగా ప్రకటించాలని, సదరు ప్రాంగణంలో పూజలు చేయడానికి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై స్పందన కోరుతూ, అలహాబాద్ హైకోర్టు, కేంద్ర ప్రభుత్వానికి అలాగే ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నాలుగో ప్రతివాది పంకజ్ కుమార్ వర్మకూ నోటీసులు పంపింది.తాజ్ మహల్ ప్రాంగణంలో శివాలయం ఉందని పేర్కొంటూ అలహాబాద్ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలైంది.“అగ్రేశ్వర్ మహాదేవ్ నాగనాథేశ్వర్ తేజో మహాలయ” ఆలయానికి సంబంధించిన అంశంపై హిందూ పక్షం కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తాజ్ మహల్ లోపల సర్వే నిర్వహించేందుకు, ఫొటోగ్రఫీకి అనుమతి ఇవ్వాలని పిటిషనర్లు కోర్టును కోరారు. ఇంతకుముందు ఇదే కేసులో సర్వే నిర్వహించాలన్న విజ్ఞప్తిని ఆగ్రా జిల్లా కోర్టు తిరస్కరించింది. దీంతో ఆ తీర్పును సవాల్ చేస్తూ న్యాయవాది హరి శంకర్ జైన్, అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన జస్టిస్ రోహిత్ రంజన్ అగర్వాల్ ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం, ASI నుంచి వివరణ కోరింది. కేంద్ర ప్రభుత్వం, ASI దాఖలు చేసే కౌంటర్ అఫిడవిట్ల ఆధారంగా తాజ్ మహల్లో సర్వేకు అనుమతి ఇవ్వాలా? లేదా? అనే అంశంపై అలహాబాద్ హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది.

