గ్రామాల్లో విలేజ్ మార్ట్ ల పైలట్ ప్రాజెక్ట్ ను ప్రారంబించిన మంత్రి నాదెండ్ల
అమరావతి: గ్రామాల్లో విలేజ్ మార్ట్ ల పేరుతో కూటమి ప్రభుత్వం కొత్త పథకంను ప్రారంభించింది. రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరకే నిత్యావసరాలు అమ్మకాలు జరిపే విధంగా గుంటూరు నియోజకవర్గం లాల్పురంలో పైలట్ ప్రాజెక్ట్ ను పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రామకృష్ణ, ఎమ్మెల్యే రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఏడు విలేజ్ మార్ట్ లను ప్రారంభించామని వెల్లడించారు. గ్రామీణ రేషన్ వ్యవస్థలో కార్పొరేట్ తరహా సంస్కరణలు తీసుకువస్తున్నామని, జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా రేషన్ షాపులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా విడతల వారీగా 1,000 మినీ మార్ట్ లను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జగన్ హయాంలో 10 వేల MDO వాహనలను తీసుకుని వచ్చి రాష్ట్రంలోని 29,750 రేషన్ షాపులను పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి మండిపడ్డారు.
60 రకాల సరకులతో మీ మార్ట్ లు:- మార్కెట్ ధరలకంటే రూ.3 నుంచి రూ.4 తక్కువ రేట్లకే నాణ్యమైన సరుకులు, మిల్లెట్స్ పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతానికి 60 రకాల సరకులతో మీ మార్ట్ లు ప్రారంభించినట్లు వివరించారు. రాబోయే రోజుల్లో 250 రకాల వస్తువులు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. విలేజ్ మార్ట్ లలో కూడా త్వరలోనే డిజిటల్ పేమెంట్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు.

