ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీ రద్దు-జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్
అమరావతి: ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని జనసేన పార్టీ నాయకులలో క్రమశిక్షణ లోపించడం… పార్టీ విధి విధానాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న తీరుపై పార్టీ మద్దతుదారుల నుంచి ఫిర్యాదులు అందుతున్న నేపధ్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీ రద్దు చేయడం జరిగిందని జనసేన అధ్యక్షడు పవన్ కళ్యాణ్ పేరుతో జనసేన కేంద్ర కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రకటన వివరాలు ఇలా వున్నాయి……జనసేన సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై బలపరిచామని.. జిల్లా నాయకుల వైఖరి అందుకు విరుద్ధంగా ఉందని జన సైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాయకుల మధ్య విభేదాలు, క్రమశిక్షణరాహిత్యం వల్ల కార్యకర్తలు ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలో జిల్లా, నగర, మండల, గ్రామ స్థాయి కమిటీలను రద్దు చేయాలని నిర్ణయించడమైనది. జిల్లా సమన్వయ బాధ్యతలు చూస్తున్నవారితోపాటు, కమిటీలలోని ఇతర సభ్యులను బాధ్యతల నుంచి తప్పించడమైనది. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుంది. క్రమశిక్షణ లేని చోట వ్యవస్థను సక్రమంగా నిర్వహించలేము. అందుకే ఈ నిర్ణయం తీసుకోవడమైంది. కొద్ది రోజుల క్రితమే ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని రద్దుపరిచాము. అదే తరహా నిర్ణయాన్ని నెల్లూరు జిల్లా కమిటీ విషయంలోనూ తీసుకున్నాము. కొత్త కమిటీని నియమించే వరకూ ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాలను కేంద్ర కార్యాలయం నుంచి పర్యవేక్షణ సాగుతుందని పేర్కొంది.

