వర్షాకాలానికి ముందే కొండవీటి వాగు, పాలవాగు వద్ద ప్రత్యేక చర్యలు-మంత్రి నారాయణ
జగన్ అనవసర రాద్ధాంతం..
అమరావతి: అమరావతి రాజధాని నిర్మాణంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేస్తున్నఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనవని, వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నమని పురపాలక శాఖ మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో విమర్శించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించకుండా, ఏసీ గదుల్లో కూర్చొని విమర్శలు చేయడం బాధ్యతారాహిత్యమని ఆయన పేర్కొన్నారు.అమరావతిలో కొండవీటి వాగు, పాలవాగు, వెస్ట్ బైపాస్ బైపాస్ ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ, రాజధాని అభివృద్ధి, రైతులకు ప్లాట్ల కేటాయింపు, వర్షాకాల సన్నాహక చర్యలు, భూసేకరణ తదితర అంశాలపై సమగ్ర వివరణ ఇచ్చారు.
వర్షాకాలానికి ముందే అప్రమత్తం:- గత ఏడాది వెస్ట్ బైపాస్ నిర్మాణ పనుల కారణంగా కొన్నిచోట్ల మట్టి పేరుకుపోవడంతో నీటి ప్రవాహానికి ఆటంకం ఏర్పడిందని గుర్తుచేశారు. ఈసారి అలాంటి పరిస్థితులు రాకుండా ముందుగానే చర్యలు తీసుకున్నామని చెప్పారు.పాలవాగుపై 30 బ్రిడ్జిలు, కొండవీటి వాగుపై 39 బ్రిడ్జిలు, మొత్తం 69 బ్రిడ్జిల వద్ద పనులు జరుగుతున్నాయని తెలిపారు.నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించే మట్టిని తొలగించడం, అవసరమైన చోట డైవర్షన్లు ఏర్పాటు చేయడం వంటి చర్యలను అధికారులు చేపట్టారని వెల్లడించారు.వెస్ట్ బైపాస్ వద్ద ఉన్న కీలక వెంట్ల పనులు మరో పది రోజుల్లో పూర్తవుతాయని సంబంధిత సంస్థలు హామీ ఇచ్చాయని చెప్పారు.
2028 ఆగస్టు నాటికి తొలి దశ పూర్తి:- ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల ప్రకారం అమరావతి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని, 2028 ఆగస్టు నాటికి తొలి దశ మౌలిక వసతుల నిర్మాణం పూర్తి చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.రోడ్లు, డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థ, విద్యుత్, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర మౌలిక వసతులను నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు.

