భారత్ కు చేరుకున్న దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్
అమరావతి: దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే-మ్యూంగ్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం న్యూఢిల్లీకి చేరుకున్నారు. పాలం విమానాశ్రయంలో ఆయనకు ఉన్నత స్థాయి దౌత్య వర్గాలు ఘనస్వాగతం పలికాయి. భారత్-దక్షిణ కొరియాల మధ్య ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఈ పర్యటన అత్యంత కీలకంగా మారనుంది. ప్రెసిడెంట్ లీ ఆదివారం విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్తో సమావేశం అవుతారు.హోటల్ ఒబెరాయ్లో జరిగే ఈ సమావేశంలో సోమవారం ప్రధాని మోదీతో జరగనున్న కీలక చర్చల ఎజెండాను ఖరారు చేయనున్నారు.
సోమవారం నాడు రాష్ట్రపతి భవన్లో లీ జే-మ్యూంగ్కు అధికారికంగా సైనిక వందనంతో స్వాగతం పలుకుతారు. అనంతరం ఆయన రాజ్ ఘాట్ సందర్శించి మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. హైదరాబాద్ హౌస్లో ప్రధాని నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. రక్షణ, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ వంటి రంగాల్లో కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. అనంతరం భారత మండపంలో జరిగే ఇండో-కొరియా బిజినెస్ ఫోరమ్లో సుమారు 200 మంది కొరియా పారిశ్రామికవేత్తలతో కలిసి పాల్గొంటారు. సాయంత్రం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. ప్రెసిడెంట్ లీ జే-మ్యూంగ్ వెంట ఆయన సతీమణి దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్ హీ-క్యూంగ్ కూడా ఉన్నారు.

