హోర్ముజ్ జలసంధిపై తిరిగి అంక్షలు అమలు చేస్తున్నట్లు ప్రకటించిన ఇరాన్
అమరావతి: ప్రపంచ చమురు రవాణాలో అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధిపై తిరిగి అంక్షలు అమలు చేస్తున్నట్లు ఇరాన్ శనివారం ప్రకటించింది. లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత శుక్రవారం రోజే ఈ మార్గాన్ని తెరిచిన ఇరాన్, కేవలం 24 గంటల వ్యవధిలోనే మళ్లీ పాత ఆంక్షలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా తన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో విఫలమైందని, ఇరాన్ ఓడరేవులపై నౌకాదళ దిగ్బంధనాన్నికొనసాగిస్తోందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ ఘాలిబాఫ్ వెల్లడించారు.
దిగ్బంధనం తొలగించే ప్రసక్తే లేదు:- ఇజ్రాయిల్-లెబనాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం నేపథ్యంలో హోర్ముజ్ జలసంధిని ఇరాన్ తెరిచినప్పటికీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘జలసంధిని తెరవడాన్ని స్వాగతిస్తున్నాం.. కానీ ఇరాన్ ఓడరేవులపై మా నౌకాదళ దిగ్బంధనం మాత్రం కొనసాగుతుంది’ అని ఆయన స్పష్టం చేశారు. ఇరాన్ అణు కార్యక్రమం, ఇతర అంశాలపై పూర్తిస్థాయి ఒప్పందం కుదిరే వరకు ఈ దిగ్బంధనం తొలగించే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు.

