DEVOTIONALNATIONALOTHERS

శ్రీవారిని దర్శనం చేసుకున్న భక్తులకు కోరిన్నని లడ్డూలు-ఈవో శ్యామలరావు

భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు..

తిరుమల: తిరుమలలో శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ఆధార్ ప్రామాణికంగా టీటీడీ సేవలు అందించేందుకు, కేంద్ర ప్రభుత్వం నుండి ప్రాథమికంగా అనుమతి లభించిందని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నుండి వెలువడనుందని, తద్వారా దర్శన, వసతి, శ్రీవారి సేవ తదితర సేవలను దుర్వినియోగం చేస్తున్న దళారులను అరికట్టవచ్చని చెప్పారు..తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది..ఈ సందర్భంగా ఈవో భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ,

1-శ్రీవారి భక్తులకు మరింత పారదర్శకంగా లడ్డూ ప్రసాదాలు అందించాలనే లక్ష్యంతో ఆగస్టు 29వ తేదీ నుంచి దర్శనం టోకెన్ లేని వారికి ఆధార్ తో లడ్డూలను అందించే విధానాన్ని టీటీడీ ప్రవేశపెట్టింది.

2-గత కొన్నేళ్లుగా పలువురు దళారులు లడ్డూల బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడుతున్నట్లు గుర్తించాం.తిరుమలలో దళారి వ్యవస్థను అరికట్టి, స్వామివారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి తగినన్ని లడ్డూలు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, దర్శనం టోకెన్లు లేనివారికి ఆధార్ కార్డుపై రోజువారి రెండు లడ్డూలను మాత్రమే జారీ చేయాలని టీటీడీ నిర్ణయించింది.

3-అలాగే చాలా కాలంగా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నప్పటికీ, బయట ప్రాంతాలలో ఉన్న టీటీడీ ఆలయాలు, చెన్నై, బెంగళూరు, వెల్లూరులలోని టీటీడీ సమాచార కేంద్రాలలో లడ్డూల డిమాండ్ ఉన్నప్పటికి మేము పంపలేకపోయాము. ప్రస్తుతం పంపిస్తున్నాం. గత నాలుగు రోజుల్లో దాదాపు 75 వేల లడ్డూలు పంపబడ్డాయి. దీనిని శాశ్వత ప్రాతిపదికన అమలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

4-⁠తిరుమలలో దర్శనం టోకెన్లు ఉన్న భక్తులకు ఒక ఉచిత లడ్డూతో పాటు, రూ.50/- ప్రాతిపదికన కోరినన్ని లడ్డూలు (స్టాక్ లభ్యత ఆధారంగా) అందజేస్తున్నాం. దీనికి ఆధార్ కార్డు అవసరం లేదు.

5-⁠ ⁠కాలినడకన వచ్చే భక్తులకు అలిపిరి పాదాలమండపం వద్ద దివ్యదర్శనం టోకెన్లు జారీ చేయు కౌంటర్లు మరియు గాలిగోపురం వద్ద స్కానింగ్ కౌంటర్లను త్వరలో పునఃప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

శ్రీవారి బ్రహ్మోత్సవాల వాహనసేవల బుక్‌లెట్‌ ఆవిష్కరణ:- తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలతో కూడిన బుక్‌లెట్‌ను టీటీడీ ఈవో శ్రీజె.శ్యామలరావు ఆవిష్కరించారు.శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో బ్రహ్మోత్సవాల సమస్త సమాచారంతో ఆకట్టుకునే రంగులతో, చిత్రాలతో బుక్‌లెట్‌ను ముద్రించారు. 

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *