రాష్ట్రంలో టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్, నైట్ సఫారీ, డాల్ఫిన్ షోలు,అరకు కాఫీ స్టాల్స్-మంత్రి దుర్గేష్
180 టెంట్లతో టెంట్ సిటీస్…
అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశానిర్దేశం మేరకు రాష్ట్ర పర్యాటక రంగంలో 20% వృద్ధి సాధించేందుకు అహర్నిశలు శ్రమిస్తామని మంత్రి కందుల దుర్గేష్ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.సీఎం అధ్యక్షతన సచివాలయంలో జరిగిన పర్యాటక రంగ సమీక్షా సమావేశంలో పర్యాటక రంగం మరింత అభివృద్ధి చెందేలా, అందరినీ ఆకర్షించేలా ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించాలన్న సీఎం సలహాలు సూచనల మేరకు వార్షిక, త్రైమాసిక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తామన్నారు. ప్రత్యేకించి టూరిజం ఫెస్టివల్ క్యాలెండర్, నైట్ సఫారీ, డాల్ఫిన్ షోలు, 150 అరకు కాఫీ స్టాల్స్, ఎక్స్ పీరియన్స్ సెంటర్స్ ఏర్పాటు వంటి పలు ప్రణాళికలు రూపొందించేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. అంతేగాక విభిన్న పర్యాటక ప్రక్రియలను ప్రవేశపెట్టి పర్యాటకుడికి మధురానుభూతి కల్పిస్తామన్నారు.కేంద్ర పథకాల ద్వారా వచ్చే నిధులతో పర్యాటక రంగం మరింతగా అభివృద్ధి చేస్తామన్నారు.
180 టెంట్లతో టెంట్ సిటీస్:- పర్యాటక రంగంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి త్వరితగతిన అనుమలు, రాయితీలు అందించి ప్రాజెక్టులు త్వరగా పట్టాలెక్కేలా చర్యలు ప్రారంభించామని మంత్రి తెలిపారు. భవానీ ఐల్యాండ్, హోప్ ఐల్యాండ్ సహా రాష్ట్రంలోని ఐల్యాండ్లన్నింటినీ అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అంతేగాక రాష్ట్రంలో అరకు, గండికోట సహా 6 ప్రాంతాల్లో 180 టెంట్లతో టెంట్ సిటీస్ ఏర్పాటు చేసే చర్యలు ప్రారంభించామన్నారు. రాజమండ్రి, విజయవాడ, బెరంపార్క్, సూర్యలంకలో పర్యాటకుల కోసం త్వరలోనే హౌస్ బోట్స్ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి చెందిన హోటళ్లు, రిసార్టులను అప్గ్రేడ్ చేయడమేగాక కొత్తగా మరికొన్ని హోటళ్లు, రిసార్టులను అభివృద్ధి చేయనున్నామన్నారు. పర్యాటక రంగాన్ని ఆకట్టుకునేలా మెగా ఈవెంట్స్, నేషనల్ ఫెయిర్స్,ఇంటర్నేషనల్ ఫెయిర్స్నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో రోప్వేల ఏర్పాటుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజన, వారసత్వ, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 500కి పైగా హోమ్ స్టేలు గుర్తించామన్నారు. దేవాలయాల్లో అధ్యాత్మిక పర్యాటక అభివృద్ధిపై చర్యలు తీసుకుంటామని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.